ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి,హైదరాబాద్: పశ్చిమాసియాలోలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇంధన వినియోగదారుల్లో గుబులు రేపుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. నగరంలో పెట్రో సెగ రాజుకునే పరిస్థితి నెలకొంటోంది. చమురు కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో బంకులకు వాహనదారుల తాకిడి పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతాయని, సరఫరా నిలిచిపోతుందనే వదంతులు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నగరంలో జరిగే విక్రయాల కంటే నాలుగు రోజులుగా 10 నుంచి 20 శాతం అధికంగా అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
వినియోగదారులు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంకులు నింపుకోవడమే కాకుండా, భవిష్యత్తు అవసరాల కోసం లీటర్ల కొద్దీ ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్, డీజిల్ను నిల్వ చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా డీలర్లు ఆయిల్ కంపెనీలకు పంపే రోజువారీ ఇండెంట్ను కూడా భారీగా పెంచుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇంధన వినియోగంలో హైదరాబాద్ మహా నగరానిదే సింహభాగం. గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధి)లో పెట్రోల్, డిజిల్ వినియోగం అధికంగా ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడయ్యే పెట్రోల్లో దాదాపు 60 శాతం, డీజిల్లో సుమారు 35 నుంచి 40 శాతం వాటా ఒక్క మహా నగరానికే దక్కుతోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్లో ప్రతిరోజూ సుమారు 30 లక్షల నుంచి 45 లక్షల లీటర్ల పెట్రోల్, అంతకంటే కొంత తక్కువ మొత్తంలో డీజిల్ విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వినియోగం అదనంగా మరో 10 లక్షల లీటర్ల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 80 డాలర్ల మార్కును చేరుకున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడలేదు.
దేశంలో సుమారు 25 రోజుల వినియోగానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు సిద్ధంగా ఉన్నట్లు తెలుసోంది. అదనంగా వ్యూహాత్మక చమురు నిల్వలు మరో 74 రోజుల వరకు రక్షణ కల్పించే అవకాశాలున్నాయి. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉనట్లు కేంద్రం భరోసా కల్పిస్తోంది.

ఆందోళన వద్దు
ఇప్పట్లో ఇంధన కొరత, ధర పెంపు ఉండబోదు. ధరల పెరుగుదలపై వదంతులను నమ్మవద్దు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం ప్రమాదకరం. అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. పౌరసరఫరాల శాఖ వినియోగదారులకు అవగాహన కలి్పంచాలి.
– అమరేందర్ రెడ్డి, పెట్రోల్ డీలర్ల సంఘం


