రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్రెడ్డిని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం
ఇప్పటికే ఖరారైన అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వం..
సీఎం పట్టుదలతో సన్నిహితుడికి దక్కిన అవకాశం
ఎట్టకేలకు ఉత్కంఠకు తెర... అంతకుముందు జూమ్లో మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో మల్లగుల్లాలు, సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి బరిలో నిలిచే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీతోపాటు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వేం నరేందర్రెడ్డికి అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కిరాగానే, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు స్వయంగా వేం నరేందర్రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు అభినందనలు తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేస్తారు.
ఆ మూడు పేర్ల చుట్టే తిరిగిన చర్చ
అభ్యర్థుల ఖరారుకు ముందు ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థి ఎంపికకు సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఢిల్లీకి చేరుకున్నా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర కీలక నేతలు అందుబాటులో లేరు. దీంతో సీఎం వారితో జూమ్ యాప్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వర్చువల్ మీటింగ్లో ప్రధానంగా మూడు పేర్ల చుట్టే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వేం నరేందర్రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, వినయ్కుమార్ పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించింది.
నెగ్గిన రేవంత్ పట్టు !
ఈ జూమ్ మీటింగ్లో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వినయ్కుమార్కు అవకాశం ఇస్తే బాగుంటుందనే వైఖరితో ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి ఈసారి ఎలాగైనా అవకాశం ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఆయన సీనియారిటీని ఈ సందర్భంగా సీఎం వివరించినట్టు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం సీఎం పట్టుదలకే అధిష్టానం గౌరవం ఇచ్చింది. వేం నరేందర్రెడ్డి వైపే మొగ్గుచూపి, జాతీయ కోటాలో అభిషేక్ మను సింఘ్వీతో కలిపి ఆయన పేరును ఖరారు చేసింది.
అభ్యర్థుల బయోడేటా:
వేం నరేందర్రెడ్డి
జననం: 1960
తల్లిదండ్రులు: వేం వెంకటమ్మ– చెన్న కృష్ణారెడ్డి
విద్యార్హతలు: బీఏ
కుటుంబ నేపథ్యం: భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్)
రాజకీయ ప్రస్థానం: ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు మహబూబూబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ, పార్టీలో ట్రబుల్ షూటర్గా, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు.
అభిషేక్ మను సింఘ్వీ
జననం: 24 ఫిబ్రవరి 1959
స్వస్థలం: జోధ్పూర్ (రాజస్తాన్)
తల్లిదండ్రులు: లక్ష్మీమాల్ సింఘ్వీ, కమల్ సింఘ్వీ
కుటుంబ నేపథ్యం: ఇద్దరు పిల్లలు
విద్యార్హతలు: ఢిల్లీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఏ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు.
రాజకీయ ప్రస్థానం: గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవం ఉంది. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానం నుంచి 2024 ఆగస్టు 28న రాజ్యసభకు వెళ్లారు.


