అభ్యర్థిని బరిలోకి దించడంపై పార్టీ మల్లగుల్లాలు
చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని నిర్ణయం
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.
సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది.
అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది.
అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.


