అదనంగా ఐపీఎస్‌లను కేటాయించండి | CM Revanth Reddy appeals to Union Home Minister Amit Shah | Sakshi
Sakshi News home page

అదనంగా ఐపీఎస్‌లను కేటాయించండి

Mar 5 2026 12:47 AM | Updated on Mar 5 2026 12:47 AM

CM Revanth Reddy appeals to Union Home Minister Amit Shah

83 మంది నుంచి105కు పెంచండి 

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి 

మావోయిస్టుల లొంగుబాటు తదితర అంశాలపై చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్‌ రివ్యూ జరిగిందని..తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్‌ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్‌షాతో సీఎం భేటీ అయ్యారు. 

రాష్ట్రానికీ అనేక ఆధునిక సవాళ్లు 
దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్‌ నేరాలు, డ్రగ్స్, వైట్‌ కాలర్‌ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటు, హైదరాబాద్‌ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌ అధికారుల అవసరం ఉందని చెప్పారు. మూడో క్యాడర్‌ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని, ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్‌ అధికారులు ఉండగా.. ఆ సంఖ్యను 105కు పెంచాలని రేవంత్‌ కోరారు.  

591 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. 
ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్‌షాతో సీఎం చర్చించారు. అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలోనే 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. 

పలువురు అగ్రనేతలు సైతం సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని చెబుతూ.. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం తదితర విషయాలను వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్‌) విజయ్‌కుమార్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ బి.సుమతి పాల్గొన్నారు.  

రాత్రికి ఢిల్లీలోనే సీఎం.. 
బుధవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొననున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement