biennial elections
-
‘రాజ్యసభ’కు బీఆర్ఎస్ దూరం ?
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
-
మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు
-
మరో ఎన్నికల నగారా... షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : మరో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 చివరి తేదీ. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో కె.కేశవరావు, ఎంఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, తెలంగాణలో కేవీపీ, గరికపాటి రాంమోహన్రావు పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే జూన్ లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ కోసం త్వరలోనే షెడ్యూలు విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వచ్చే కొద్ది కాలంలో ఖాళీ అయ్యే స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చే ఏప్రిల్ లో ఖాళీ అవుతున్న 13 స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూలు విడుదల చేసింది. అస్సాం (2), హిమాచల్ ప్రదేశ్ (1), కేరళ (3), నాగాలాండ్ (1), త్రిపుర (1), పంజాబ్ (5) రాష్ట్రాల్లో 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చే ఏప్రిల్ లో పూర్తవనుంది. ఆ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు ప్రకటించింది. ఈ ఎన్నికల నిర్వహణకు మార్చి 4 న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ స్థానాలకు మార్చి 21 న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ కాలం పూర్తవుతున్న సభ్యుల స్థానంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూలు విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి (టీడీపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), జేడీ శీలం (కాంగ్రెస్)ల పదవీకాలం జూన్ 21తో పూర్తవుతోంది. అలాగే తెలంగాణలో వీ హన్మంతరావు (కాంగ్రెస్), గుండు సుధారాణి (టీడీపీ - తర్వాత టీఆర్ఎస్ లో చేరారు)ల పదవీ కాలం కూడా అదే సమయానికి పూర్తవుతోంది.


