కార్పొరేట్ కళాశాలల ఆఫర్
క్యాంపస్ సందర్శన అంటూ మాయాజాలం
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో పదవ తరగతి వార్షిక పరీక్షల వేడి మొదలవ్వక ముందే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేశాయి. విద్యార్థులు ఇంకా ఎస్సెస్సీ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతుండగానే ‘ఇంటర్’ సీటు రిజర్వు చేసుకోవాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ‘ముందస్తు రిజర్వేషన్.. భారీ ఫీజు డిస్కౌంట్’ అనే నినాదంతో తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో పడ్డాయి. వీకెండ్ వస్తే చాలు ప్రధాన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, నేరుగా ఇళ్లను సందర్శించడం సర్వసాధారణమైంది.
తమ క్యాంపస్లలో ఉన్న వసతులను చూపిస్తూ ఏసీ క్లాస్రూమ్లు, అత్యాధునిక ల్యాబ్ల పేరుతో భ్రమలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే ఇప్పుడే చేరాలని, లేదంటే సీట్లు దొరకవని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. వాస్తవానికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పదవ తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు నిర్వహించడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలు బేఖాతర్ చేస్తూ అడ్మిషన్ల కోసం అడ్డదారులకు తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రత్యేక బ్యాచ్ల ఆకర్షణ
సాధారణ తరగతులకు భిన్నంగా.. అత్యంత ప్రతిభావంతుల కోసం అంటూ ప్రత్యేక విభాగాలను ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను బురిడీకొట్టించడం సాధారణంగా తయారైంది. ముందస్తుగా సీటు బుక్ చేసుకుంటే ఫీజులో 20 నుండి 40 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ఆశ కలిగిస్తున్నారు. పరిమిత సీట్లంటూ జేఈఈ, మెడిసిన్ ర్యాంకుల హామీలు, క్యాంపస్లో చేరితే ఐఐటీల్లో సీటు గ్యారెంటీ అంటూ ఆరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. విద్యార్థుల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల బలహీనతలను, వారి భవిష్యత్తు ఆందోళనలను ఈ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ప్రీ–రిజిస్ట్రేషన్ మాయాజాలం
పదవ తరగతి పరీక్షలు కూడా పూర్తికాకముందే సీటు గ్యారెంటీ అంటూ తల్లిదండ్రుల నుండి ప్రీ–రిజిస్ట్రేషన్ అడ్మిషన్న్టోకెన్ పేరిట కొంత వసూలు చేస్తున్నారు. ఆ తరువాత వస్తే ‘సీటు దొరకదు‘ అని చెప్పి తల్లిదండ్రులను మానసికంగా సిద్ధం చేస్తారు. ఒకసారి ఈ సొమ్ము చెల్లిస్తే, ఒకవేళ విద్యార్థికి వేరే కాలేజీలో సీటు వచ్చినా, ఆలోచన మార్చుకున్నా ఈ డబ్బు తిరిగి రాదు. ఇది కార్పొరేట్ విద్యా సంస్ధల మార్కెటింగ్ గిమ్మిక్కుల్లో ప్రధానమైనది.
చదవండి: 'మమ్మల్ని పంపించండి మహాప్రభో'
ఫీజుల మోత
మహా నగరంలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కార్పొరేట్ విద్యా సంస్థలు క్యాంపస్లు బట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి. మాదాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, శివారులోని డిమాండ్ ఉన్న ఏరియాల్లో కోర్సు ఆధారంగా ఫీజులు మారుతుంటాయి. కార్పొరేట్ సంస్థలు అందించే సౌకర్యాలను బట్టి ఫీజులను మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు:


