డారెన్ సామీ (pic: X)
టి20 ప్రపంచకప్లో వెస్టిండీస్ జట్టు తమ చివరి మ్యాచ్ మార్చి 1న ఆడింది. క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న విండీస్ టీమ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో టీమిండియాతో తలపడి ఓటమి పాలయింది. వరల్డ్కప్లో తమ పోరాటం ముగియడంతో స్వదేశానికి పయనం కావాల్సిన విండీస్ జట్టు అనూహ్యంగా ఇండియాలో చిక్కుబడి పోయింది. ఐదు రోజుల నుంచి కోల్కతాలోనే పడిగాపులు కాస్తోంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ ప్రధాన కోచ్ డారెన్ సామీ తన బాధను ఎక్స్ వేదికగా వ్యక్తీకరించాడు.
తమను ఎప్పుడు స్వదేశానికి పంపిస్తారో చెప్పాలని డారెన్ సామీ (Daren Sammy) వేడుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఈరోజా, వచ్చే వారమా అనేదానైనా చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయిందని వాపోయాడు. కాగా, తమ జట్టు సభ్యులు భారత దేశంలో సురక్షితంగా ఉన్నారని క్రికెట్ వెస్టిండీస్ (CWI) అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అంతర్జాతీయ గగనతల నియంత్రణల కారణంగా తమ జట్టు స్వదేశానికి రాలేకపోయిందని తెలిపింది. ఇండియాలో తమ టీమ్కు తగిన వసతి కల్పించారని పేర్కొంది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా గగనతలంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో గల్ప్ దేశాలతో సహా పలు మార్గాల్లో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విమాన ప్రయాణాలపై అనిశ్చితి కొనసాగుతోంది. జింబాబ్వే క్రికెట్ జట్టు కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంది.
జట్టు కొంచెం ఆలస్యంగా స్వదేశానికి వచ్చినా ఫర్వాలేదని, క్రికెటర్ల భద్రతకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని క్రికెట్ వెస్టిండీస్ స్పష్టం చేసింది. ఆటగాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో సమన్వయం చేసుకుంటున్నామని వివరించింది. తొందరలోనే వారికి స్వదేశానికి తీసుకొస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
చదవండి: 'థ్యాంక్స్ సంజు సామ్సన్.. ఇదీ రియల్ కేరళ స్టోరీ'


