కోరిక తీర్చాలని వేధింపులు
బలవంతంగా లొంగదీసుకున్న యువకుడు
విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులు
సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగిన బాలిక
మూడునెలలుగా చికిత్స పొందుతూ.. హైదరాబాద్లో మృతి
నిందితుడిపై పోక్సో, రేప్ కేసు నమోదు
జగిత్యాల జిల్లా: జులాయిగా తిరిగే ఓ యువకుడు వావివరుసలు మరిచి.. వరసకు చెల్లె అయిన బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి.. వెంటపడి.. ప్రేమ ఊబిలోకి దింపి శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది.
అప్పటినుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కు మారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది.
బాలికకు వరసకు సోదరుడైన కోల మహేశ్ జులాయిగా తిరుగుతూ.. ఆమెపై కన్నేశాడు. ప్రేమపేరుతో వేధించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపుతానని బెదిరించాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’ అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక∙డిసెంబర్ 8న పురుగులమందు తాగింది. బంధువులు ఆమెను ముందుగా జగిత్యాలకు.. అక్కడినుంచి హైదరాబాద్ తరలించారు. తండ్రి నెల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది.
నిందితుడిపై పోక్సో, రేప్ కేసు
బాలిక మరణానికి కారణమైన మహేశ్పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


