మార్చి మొదటి వారంలోనే మండుతున్న ఎండలు
జిల్లాలో 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
గాలిలో తేమశాతం పడిపోతుండడంతో ఉక్కపోత
గతేడాది కన్నా ఎండలు పెరిగే అవకాశం
నిర్మానుష్యంగా మారిన కరీంనగర్లోని తెలంగాణచౌక్
కరీంనగర్: మొన్నటి వరకు చలికి గజగజలాడిన ప్రజలు ఇప్పుడు భానుడి భగభగలు తట్టుకోలేకపోతున్నారు. వారం రోజుల నుంచి జిల్లాలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మార్చి 4న ఏకంగా 37.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనాలు వేడితో ఇబ్బంది పడ్డారు. రాత్రి వేళలోనూ ఉక్కపోత ప్రారంభమైంది. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి చివరి వారం వరకు 42 డిగ్రీలు, ఏప్రిల్లో 44 డిగ్రీలు, మే నెలలో 46 డిగ్రీలపైనే నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎండతో ఇబ్బంది పడుతున్నారు. పదోతరగతి పరీక్షలు ప్రారంభం నాటికి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతోంది.
తగ్గుతున్న తేమశాతం
గాలితో తేమశాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమశాతం తగ్గే కొద్దీ వేడి, వడగాలుల తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం గాలిలో ఉదయం పూట తేమ 50 శాతం వరకు ఉంటుండగా మధ్యాహ్నం 15–20 శాతానికి పడిపోతోంది. ఓ వైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగా లులు పెరుగుతున్నాయి. ఏప్రిల్లో ఉదయం పూట తేమ 40 శాతంలోపునకు, మధ్యాహ్నం సమయంలో 10 శాతానికి పడిపోయే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అప్పుడే వడగాలులు
వాహనాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోంది. కార్బన్డైయాకై ్సన్ గాలిలో చేరుతుండడంతో వేడి పెరుగుతుంది. సాధారణంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు వీయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాలులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం.


