కరీంనగర్ అర్బన్/కొత్తపల్లి: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ అవగాహన ప్రచార వాహనాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కలెక్టరేట్లో బుధవారం ప్రారంభించారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు వివిధ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పరిధిలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గృహ విని యోగదారులు తమ ఇంటి డాబాపై సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకొని ప్రతి నెలా 360 యూనిట్ల సోలార్ విద్యుత్ వరకు పొందవచ్చునన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ కల్పించనుందని, మిగులు విద్యుత్ను గ్రిడ్కు ఇస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని సూచించారు. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


