సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వివిధ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా తీసుకున్న భారీ రుణాలు. మరోవైపు బల్దియాకు అధిక ఆదాయ వనరులైన ఆస్తిపన్ను, టౌన్ప్లానింగ్ ఫీజులు భారీగా తగ్గే పరిస్థితులు. ఇంకోవైపు తీసుకున్న అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉండటంతో అప్పులు కట్టాల్సిన బాధ్యతతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలు ఏళ్లకేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో కొండలా పేరుకు పోయిన బకాయిలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ విస్తరించి మూడు కార్పొరేషన్లుగా మారింది. దీంతో కొత్త కార్పొరేషన్లు బకాయిలు కట్టే పరిస్థితిలో లేవు. జీహెచ్ఎంసీ పరిధి ఎక్కువగా ఉన్నా ఆదాయం వచ్చే అవకాశం అంతంతమాత్రమే. దీంతో మూడు కార్పొరేషన్లు మనుగడ సాగించాలంటే, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి
చెందాలంటే వివిధ ప్రాజెక్టుల (ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ,సీఆర్ఎంపీ) కోసం తీసుకున్న అప్పుల్ని ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది.
ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను కానీ, స్టాంపుడ్యూటీ ద్వారా కానీ, వృత్తిపన్ను ద్వారా కానీ, ఇతరత్రా రూపాల్లో జీహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలేవి చెల్లించకుండా, వాటి బదులు తమ అప్పులు తీర్చాల్సిందిగా కోరింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తోంది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటులో ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఏ కార్పొరేషన్పైనా భారం లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
రుణ భారం
గత ప్రభుత్వ హయాంలో నగరంలో భారీయెత్తున మౌలిక సదుపాయాలు కలి్పంచారు. అభివృద్ధి పనులు చేశారు. అందుకుగాను మున్సిపల్ బాండ్ల జారీ, వాణిజ్య రుణాలు, ఇతరత్రా వెరసి రూ.6,530 కోట్ల అప్పులు చేశారు. వడ్డీ సహా చెల్లింపులు పోను గత అక్టోబర్ వరకు మిగిలిన అప్పుల భారం రూ.4,877 కోట్లు.
రాని బకాయిలు
వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి నిధులు రావడం లేదు. వాటిలో స్టాంపు డ్యూటీవే దాదాపు రూ.2,500 కోట్లు బకాయిలున్నాయి. మ్యుటేషన్ ఫీజులు రూ. 100 కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను తదితరాలు వెరసి వేల కోట్లు రావాలి. ఇవేవీ రాకపోవడంతో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. అయినప్పటికీ నెలనెలా సిబ్బంది జీతాలకు దాదాపు రూ.120 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.
వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ ఈ విజ్ఞప్తి చేసింది. మూడు కార్పొరేషన్లలో జనాభా, మౌలిక వసతులు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేశారు. కానీ, అప్పుల భారం ఉంటే ప్రగతి ముందుకు సాగదని, అభివృద్ధి ఆగిపోగలదని భావించి ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉన్నాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాగలదని ఆశిస్తున్నారు.
‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ నేటినుంచే
నగర కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలులో నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తద్వారా రాబోయే కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపు కోసం బాట వేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి వారం నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ నగరం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన నేపథ్యంలో వీటి పరిధిలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు అగ్రసేన్ మహరాజ్ జంక్షన్, చాచానెహ్రూ పార్కు, పబ్లిక్హెల్త్ ఇంజినీరింగ్ కార్యాలయం, కొత్వాల్గూడ, ఉప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. మూడు కార్పొరేషన్ల అధికారులు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఎక్కువగా చెత్త తరలింపు వంటి పనులకు ప్రాధాన్యమిచ్చారు.
నగరానికి ప్రాధాన్యం ఎందుకు ?
రాజధాని హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా మారడంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలి్పంచవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మూడు కార్పొరేషన్లు ప్రస్తుతం స్పెషలాఫీసర్ పాలనలో ఉన్నాయి. జరగబోయే ఎన్నికల్లో మూడింట రెండు కార్పొరేషన్లను గెలుచుకోవాలనేది అధికార పార్టీ ఆలోచన కాగా, ఒక కార్పొరేషన్ను మిత్రధర్మంగా ఎంఐఎంకు వదిలేశారనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. మూడుకార్పొరేషన్ల ఎన్నికలూ ఒకేసారి జరుగుతాయా, లేక
వేర్వేరుగానా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.


