జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో తయారు చేయాలని అధికారులకు ఆదేశం
అన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచన.. కోర్ ఏరియాలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలి
ఓఆర్ఆర్ లోపల రోడ్లలన్నింటినీ పురపాలక శాఖ పరిధిలోకి తేవాలి
పురపాలక, పట్టణాభివృద్ధి్ద శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బన్) మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టాన్ని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమ తులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరి యాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలి యక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని, ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
రోడ్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి, ఆ లోపు దానిని తొలగించినా అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో కనిపించాలని సీఎం అన్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు.
ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని, నగరంలోని సర్కిల్స్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని సూచించారు ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ ఎంఏయూడీ(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్)పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
భవనాల పనులు వేగవంతం చేయాలి
భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని , అక్కడ అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతోపాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఇ.వి.నరసింహారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్, జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


