అంతర్జాతీయ మీడియాలో కథనాలు
దుబాయ్: తండ్రి అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నూతన సుప్రీంనేత పీఠంపై కూర్చున్న మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగా నీలినీడలు తొలగిపోవట్లేదు. ఫిబ్రవరి 28నాటి దాడిలో తండ్రి, తల్లి, సోదరి, భార్య, కుమారుడు చనిపోగా మొజ్తాబా ఒక కాలును కోల్పోయారని గురువారం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బాంబుదాడిలో ఆయన పొత్తి కడుపు లేదా లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ కారణంగా ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని ‘ది సన్’ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. కోమాలోంచి ఆయన కోలుకోవడం కష్టమేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని, ప్రస్తుతం టెహ్రాన్ నగరంలోని సినా విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారని ఆ కథనంలో వెల్లడించింది. ఆస్పత్రిలోని వ్యక్తులు లండన్లోని తమ వర్గీయులకు పంపిన సందేశంలో ఈ సమాచారం లీక్ అయినట్లు భోగట్టా.


