ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ వణికిపోతోంది. ఇదిలా ఉండగా ఈ యుద్ధం గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
‘డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఇరాన్తో యుద్ధం చేస్తున్నారంటే, ఆ దేశం తనకు ఎదురు నిలవలేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన నా దేశం ఉత్తర కొరియాను కానీ, చైనా, రష్యాను కానీ రెచ్చగొట్టే ధైర్యం చేయడు, ఎందుకంటే మా శక్తి, క్షిపణుల గురించి ఆయనకు బాగా తెలుసు.
ఒక్క క్షిపణితో అమెరికా మొత్తాన్ని అదృశ్యం చేయగల సామర్థ్యం మాకు ఉంది. ఏ దేశాలైతే బదులు ఇవ్వలేవని అతడు (ట్రంప్) నమ్ముతాడో ఆ దేశాలతో విభేదాలను కోరుకుంటాడు.
కానీ ఇరాన్ నిజంగా అనుకుంటే, అది అమెరికాపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయగలదు. ఇది చాలా పెద్ద సంఖ్యలో అమెరికన్ పౌరుల మరణానికి కారణమవుతుందని వారు భయపడుతున్నారు. బెదిరింపులు శక్తిని నిరూపించవు. ఒక దేశం నిజమైన గొప్పతనం శాంతి, న్యాయం, మానవ జీవితం పట్ల గౌరవంలో కనిపిస్తుంది’ అని కిమ్ వ్యాఖ్యానించినట్లుగా ఆయా వార్తల్లో ఉంది.
అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ఎలాంటి ధ్రువీకరణలు లేవు. అటు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ అయిన కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) కానీ, ఇటు ఇతర ప్రామాణిక అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి దీని గురించి ప్రస్తావన లేదు.


