వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశంలోని పలువురు ఉన్నతాధికారుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92,47,48,000) బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాన్ని అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా ప్రకటించింది.
రివార్డు ఉన్న వ్యక్తుల జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు కీలక నేతలు, అధికారులు అలీ అస్గర్ హిజాజీ, యాహ్యా రహీమ్ సఫవి, అలీ లరిజాని, ఎస్మాయిల్ ఖతీబ్ ఎస్కందర్ మొమెని ఉన్నారు. ఈ నాయకులపై సమాచారం ఇచ్చే వారికి అమెరికా బహుమతి ప్రకటించింది.
అమెరికా ఈ నాయకులకు వేర్వేరుగా కచ్చితమైన మొత్తాన్ని బహుమతిగా ప్రకటించలేదు. అమెరికా చెప్పింది ఒక్కటే.. ఎవరైనా తమకు ఇచ్చే సమాచారం ఉపయోగపడితే “గరిష్ఠంగా $10 మిలియన్ (సుమారు రూ.92-93 కోట్లు) వరకు” బహుమతి ఇవ్వవచ్చు.
రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం అంటే అమెరికా మీద ఉగ్రదాడులు చేసినట్లు అనుమానించే వ్యక్తులను గుర్తించేందుకు సమాచారం ఇచ్చిన వారికి డబ్బు బహుమతి ఇచ్చే కార్యక్రమం. మొజ్తబా ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులను “ఇరానియన్ టెర్రరిస్టులు”గా పేర్కొంటూ అమెరికా ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది.
“ఈ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లో వివిధ విభాగాలను నడిపిస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర చర్యలకు ప్రణాళికలు వేసి, అమలు చేస్తుంది” అని చెప్పింది.
“ఈ ఐఆర్జీసీ నాయకులు లేదా దాని విభాగాలపై సమాచారం తెలిసినవారు ఆ విషయాన్ని టోర్ ఆధారిత టిప్లైన్ లేదా సిగ్నల్ ద్వారా మాకు పంపండి. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి లభించే అవకాశం ఉంటుంది” అని తెలిపింది.
టోర్ అంటే ఇంటర్నెట్లో గుర్తింపును దాచుతూ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ. సిగ్నల్ అంటే గోప్యంగా సందేశాలు పంపే ఎన్క్రిప్షన్ ఆధారిత మెసేజింగ్ యాప్.


