పశ్చిమాసియా మంటలు! | Sakshi Editorial On West Asia war | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా మంటలు!

Mar 3 2026 4:20 AM | Updated on Mar 3 2026 4:20 AM

Sakshi Editorial On West Asia war

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూల బాధ్యతారహిత చర్యతో ఒక్కసారిగా పశ్చిమాసియా నిప్పులకొలిమైంది. శనివారం ఉదయం ఒక పథకం ప్రకారం ఇజ్రాయెల్, అమెరికా సైనిక బలగాలు ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా అనేక నగరాలు, పట్టణాలపై బాంబులతో, క్షిపణులతో విరుచుకుపడి ఆరంభంలోనే ఇరాన్‌ మత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతోపాటు ఆయనతో చర్చిస్తున్న కీలకమంత్రులు, రక్షణరంగ బాధ్యులతో సహా దాదాపు 30 మందిని హత మార్చాయి. పర్యవసానంగా యుద్ధం ఆరంభమైన మూడో రోజుకే ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలన్నీ భగ్గున మండుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులతో కోట్లాదిమంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టు కుని ఉన్నారు. మంగళవారం విమాన రాకపోకలు మొదలెడతామని దుబాయ్‌ అంటు న్నది. సాధ్యాసాధ్యాలపై సంశయాలున్నాయి.

సాధారణంగా యుద్ధం తొలి దశలో దేశాధినేతలు, ఇతర కీలక బాధ్యుల జోలికి పోరు. చర్చలకు రప్పించటం, రాజీ తప్ప మరే మార్గమూ లేదన్న అభిప్రాయం కలిగించడం దీని వెనకుండే వ్యూహం. కానీ ట్రంప్, నెతన్యాహూల దుందుడుకుతనం ఆ అవ కాశానికి శాశ్వతంగా తలుపులు మూసింది. అందుకే యుద్ధం ఎడతెగకుండా సాగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ ఎప్‌స్టీన్‌తో ఉన్న నీతిబాహ్య సంబంధాలు బట్టబయలు కావటం, స్వీయ తప్పిదాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా స్థితికి చేరుకుని సాధారణ ప్రజానీకం దుర్భరమైన స్థితిలో బతుకీడ్వటంవంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే నవంబర్‌ మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ట్రంప్‌ ఈ దుస్సాహసానికి తెగించారు. అటు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పదవీభ్రష్టత్వం, జైలు తప్పవని బెంగటిల్లుతున్న నెతన్యాహూ సరిజోడీ అయ్యారు. ఇద్దరికిద్దరూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టారు. 

అంతక్రితం మాటెలా ఉన్నా పశ్చిమాసియాకు సంబంధించి అమెరికా మూడున్నర దశాబ్దాలుగా కట్టుకథలతో కాలక్షేపం చేస్తోంది. అకారణంగా దాడులకు దిగుతూ, జనహననానికి పాల్పడుతూ తప్పుడు సాకులు వెదుకుతోంది. మొదట ఇరాక్‌–కువైట్‌ల మధ్య చిచ్చురగిల్చి, ఆ తర్వాత ఇరాక్‌ను అదుపు చేయడానికంటూ 1990–91లో ‘ఆపరేషన్‌ డిజర్ట్‌ స్టార్మ్‌’ పేరిట అమెరికా విరుచుకుపడింది. కనీసం అప్పుడు భద్రతా మండలి అనుమతి తీసుకుంది. 35 దేశాలను తోడుతెచ్చుకుంది. అసత్యాలే చెప్పినా దేశ ప్రజలనుద్దేశించి సీనియర్‌ బుష్‌ నాలుగు దఫాలు ప్రసంగించారు. 

కానీ చివరకు అదంతా అమెరికా మాయోపాయం వల్లే జరిగిందని ఆలస్యంగా గ్రహించిన చాలా దేశాలు సీనియర్‌ బుష్‌ కుమారుడు జార్జి డబ్ల్యూ బుష్‌ ఆధ్వర్యంలో సాగిన 2003 నాటి ‘ఆపరేషన్‌ ఇరాకీ ఫ్రీడమ్‌’ యుద్ధానికి మొహం చాటేశాయి. ‘జీవ రసాయన ఆయుధాల’ సాకుతో జరిపిన ఆ యుద్ధానికి బ్రిటన్, పోలెండ్, ఆస్ట్రేలియాలు మాత్రమే సహకరించాయి. భద్రతామండలి ఆమోదం దక్కలేదు. 2015 నాటికి ‘జీవ రసాయన ఆయుధాలు’ కూడా బూటకమని తేలింది. 

అందుకే కావొచ్చు... ట్రంప్‌ భద్రతామండలి సంగతలా ఉంచి, కనీసం చట్ట ప్రకారం అమెరికా ప్రతినిధుల సభ అనుమతి సైతం తీసుకోకుండా ఇప్పుడు చిచ్చు రగిల్చారు. ప్రపంచంలో జరిగే ఏ యుద్ధంలోనూ తలదూర్చబోనని హామీ ఇచ్చి ట్రంప్‌ గద్దెనెక్కారు. తీరా అందుకు విరుద్ధమైన పోకడలుపోతున్నారు. వాస్తవానికి అమెరికా–ఇరాన్‌లు ఒప్పందానికి చేరువలోవున్నాయని మధ్యవర్తి ఒమన్‌ ప్రకటించింది. కానీ 24 గంటలు గడవకుండానే ఏకపక్షంగా ట్రంప్‌ ఈ దుస్సాహసానికి తెగబడ్డారు. 

ఇరాన్‌తో స్నేహం నటిస్తూనే సౌదీ ద్రోహం చేసిందనీ, ఖమేనీపై దాడి వెనక దాని పాత్ర ఉన్నదనీ మీడియా కథనం. తమ సైనిక స్థావరాలుంటే ఇరుగుపొరుగు కన్నెత్తి చూడరని చెబుతూ 80వ దశకం నుంచి గల్ఫ్‌ దేశాలన్నిటా అమెరికా వాటిని నెలకొల్పింది. ఇరాన్‌ ప్రతీకార దాడులు అదంతా భ్రమగా తేల్చాయి. ఇప్పుడు హోర్మూజ్‌ జలసంధి మూతబడింది. ట్రంప్‌– నెతన్యాహూ ద్వయం కదిలించిన ఈ తేనెతుట్టె ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో,ఎంత జన నష్టానికీ, విధ్వంసానికీ కారణమవుతుందో చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement