యుద్ధానికి సంబంధించి ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రధానమైన నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్లతో పాటు కీలకమైన స్థావరాలను నాశనం చేశామని, యుద్ధం ముగింపు ఒక్కటే మిగిలి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటనలపై ప్రకటనలు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం అందుకు ధీటుగా బదులిస్తోంది. తమకు ఏమీ కాలేదని, ఇక నుంచి తమ నుంచి ఎదుర్కోబోయే పరిణామాలను ప్రపంచం చూడబోతుందనే అర్ధం వచ్చేలా ఇరాన్ కౌంటర్ల మీద కౌంటర్ల ఇస్తోంది.
తమను తక్కువగా అంచనా వేయొద్దని ట్రంప్కు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. తమతో యుద్ధాన్ని ముగించేది మీరు కాదని, ఆ యుద్ధానికి ముగింపు తామిస్తామంటూ స్పష్టం చేసింది. ‘ యుద్ధం ముగించేది మీరు కాదు. మేం. గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది కూడా మేమే. మీపై(అమెరికా-ఇజ్రాయెల్) దాడులు చేస్తూనే ఉంటాం’ అని ఇరాన్ హెచ్చరించింది.
కాగా, ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.
పుతిన్ ఆందోళన
అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం ఉంటుందన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం 30 రోజుల్లో హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతబడిపోతుందని, అదే గనుక జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.


