అబుదాబి:అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రవాణా కార్యకలాపాలు నిలిచిపోవడంతో పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలతో కలిసి స్వదేశానికి చేరలేక, బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో దుబాయ్లోని ప్రవాస భారతీయ వ్యాపారవేత్త యోగేష్ దోషి ముందుకు వచ్చారు. ఆయన తన 64 అపార్ట్మెంట్ల భవనాన్ని భారతీయులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. భారతీయులకు వసతి, భోజనం, కనీస అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేశారు. హోటళ్లలో ధరలు అమాంతం పెరిగిన ఈ సమయంలో, దోషి కల్పిస్తున్న సౌకర్యాలు భారతీయులకు పెద్ద ఊరట లభించినట్లైంది.
దుబాయ్లో చిక్కుకున్న 125 మంది భారతీయులకు ఇప్పటికే ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయంతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు తమకు సమాచారం అందించాలని రాయబార కార్యాలయం కోరింది.
దుబాయ్కు సమీపంలోని అజ్మాన్లో కూడా భారతీయులకు ఆశ్రయం లభిస్తోంది. యుఎఇ వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన ఫామ్హౌస్ను తాత్కాలిక వసతిగా మార్చి, ఉచిత నివాసం, భోజనం అందిస్తున్నారు. హోటళ్లలో స్థలం లేక, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను ఆయన తన కార్లతో భారతీయుల్ని తరలిస్తున్నారు. అందులో ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో తీసుకువచ్చి ఫామ్హౌస్లో ఆశ్రయం కల్పించారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు జరిపి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దుబాయ్లో చిక్కుకున్న భారతీయులకు యోగేష్ దోషి, ధీరజ్ జైన్ వంటి వ్యాపారవేత్తల మానవతా చర్యలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.


