ఇజ్రాయెల్ దాడులతో బీరూట్లో పెల్లుబికిన మంటలు, దాహియేలో పొగలు
భారీ స్థాయిలో దాడులకు దిగుతున్న ఇరాన్
దుబాయ్ విమానాశ్రయం, చమురు కేంద్రాలపైనా
బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ లక్ష్యమేనని ప్రకటన
భారతీయునితో సహా నలుగురికి గాయాలు
ఇరాన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, అమెరికా
దాడులతో దద్దరిల్లిన టెహ్రాన్, ఇతర నగరాలు
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం తగ్గుముఖం పట్టే సూచనలే కన్పించడం లేదు. 12వ రోజైన బుధవారం ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ భారీ స్థాయిలో పరస్పర దాడులను కొనసాగించాయి. పర్షియన్ గల్ఫ్ పొడవునా పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. యూఏఈ నౌకాశ్రయంలో ఒక కంటైనర్ నౌకపై డ్రోన్ దాడి జరిపింది. నౌక పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది. అంతేగాక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా ఇరాన్ మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. రెండు డ్రోన్లు విమానాశ్రయంపైనే పడి పేలిపోయాయి.
ఈ ఘటనలో ఒక భారతీయునితో సహా నలుగురు గాయపడ్డారు. అయితే విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక గల్ఫ్లోని అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రాలపై కూడా ఇరాన్ ఎడాపెడా దాడులు జరిపింది. ఇకపై పశ్చిమాసియాలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుని పెద్దపెట్టున దాడులు చేస్తామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. దాంతో ఆ ఆర్థిక సంస్థల పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరాన్ ప్రయోగించిన 8 డ్రోన్లను నేలకూల్చినట్టు కువైట్, 5 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించాయి. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను కూడా నేలకూల్చినట్టు సౌదీ తెలిపింది. ఖతర్, ఒమన్, బహ్రెయిన్పై కూడా ఇరాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు జరిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో రువైస్ చమురు శుద్ధి కేంద్రాన్ని మూసేస్తున్నట్టు యుఏఈ ప్రకటించింది. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాలపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది.
ఇరాన్పై తీవ్ర దాడులు
మరోవైపు ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులు బుధవారం కూడా ఇరాన్ను అల్లాడించాయి. రాజధాని టెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. టెహ్రాన్లోని బ్యాంక్ సఫా భవనం దాడుల్లో తీవ్రంగా దెబ్బ తింది. దాని సిబ్బందిలో పలువురు మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి.
హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు బుధవారమూ కొనసాగాయి. రాజధాని బీరూట్లో అత్యంత జనసమ్మర్ధంతో కూడిన ఐచా బకర్ ప్రాంతంలో పలు భవనాలు దాడుల్లో పూర్తిగా దెబ్బతిని మంటల్లో చిక్కుకున్నాయి. దక్షిణ, తూర్పు లెబనాన్లో జరిపిన దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్టు తెలుస్తోంది. వారిలో ఒక రెడ్క్రాస్ సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. లెబనాన్లో మృతుల సంఖ్య 570 దాటినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
160 మంది అమెరికా సైనికులకు గాయాలు
ఇరాన్పై యుద్ధంలో ఇప్పటిదాకా 140 మంది అమెరికా సైనికులు గాయపడ్డట్టు పెంటగాన్ ప్రధాన అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ధ్రువీకరించారు. ‘‘వారిలో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. 108 మంది ఇప్పటికే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జై విధుల్లో చేరారు’’అని చెప్పారు. అయితే గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 160 పై చిలుకేనని తెలుస్తోంది.
40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల: ఐఈఏ
పారిస్: పశ్చిమాసియా యుద్ధంతో చమురు సరఫరా పడకేసిన నేపథ్యంలో అత్యవసర నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఈఏ ఈ స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేయడం చరిత్రలో ఇదే తొలిసారి! అయితే హార్మూజ్ జలసంధి గుండా చమురు, సహజ వాయువు రవాణా వీలైనంత త్వరగా పునఃప్రారంభం కావడమే సమస్యకు పరిష్కార మార్గమని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీ బిరోల్ ఆశాభావం వెలిబుచ్చారు.
మధ్యవర్తిత్వానికి తెర: ఖతర్
దోహా: ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశం తరఫున చర్చల్లో మధ్యవర్తిగా కొనసాగబోనని ఖతర్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలకు ఆ దేశం మధ్యవర్తిత్వం వహించడం తెలిసిందే. అయినా తమపై ఇరాన్ దాడులు చేసిందంటూ ఖతర్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మహమ్మద్ బిన్ అద్బుల్ అజీజ్ అల్ఖులైఫీ ఆవేదన వెలిబుచ్చారు.
హార్మూజ్ పొడవునా మందుపాతర్లు
హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందుపాతరలు అమర్చుతోంది! వీటిని తొలగించడం అత్యంత భారీ వ్యయప్రయాసలతో కూడిన పని. వాటి బారిన పడకుండా సురక్షితంగా హార్మూజ్ను దాటే మార్గం ఇరాన్కు మాత్రమే తెలుసు! ఈ నేపథ్యంలో ఆ మందుపాతరలను తక్షణం తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటమిచ్చారు. లేదంటే ఆ దేశంపై దాడులను కనీవినీ ఎరగని స్థాయికి పెంచుతామని హెచ్చరించారు.
హార్మూజ్లో మందుపాతరలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్కు చెందిన 16 మైన్లేయర్ పడవలను పేల్చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు, హార్మూజ్ను మూసేసినట్టు ఇరాన్ ప్రకటించినా, ఆ దేశానికి చెందినవిగా భావిస్తున్న పలు చమురు నౌకలు మాత్రం దానిగుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలో బ్యారెల్కు 200 డాలర్లు!
ప్రపంచం సిద్ధపడాలి: ఇరాన్
పశ్చిమాసియా కల్లోలం నేపథ్యంలో చమురు ధరలు త్వరలో ఆకాశాన్నంటడం ఖాయమని ఇరాన్ జోస్యం చెప్పింది. ‘‘అవి త్వరలో బ్యారెల్కు ఏకంగా 200 డాలర్ల దాకా చేరవచ్చు. ప్రపంచమంతా అందుకు సిద్ధంగా ఉండాలి’’అని ఇరాన్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫకరీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బ తీసినందుకు ఇలాంటి పర్యవసానాలు తప్పవన్నారు.
‘‘ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇప్పటిదాకా పరిమిత స్థాయి ప్రతీకార దాడులకే పరిమితమయ్యాం. కానీ ఇకపై వాటిపై పూర్తిస్థాయిలో ఎడతెరిపి లేకుండా దాడులకు దిగుతాం’’అంటూ హెచ్చరించారు. చమురు, సహజవాయువు సరఫరాల్లో ఆటంకానికి అమెరికాయే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ దుయ్యబట్టారు.
యుద్ధానికి త్వరలో తెర: ట్రంప్
ఇరాన్లో ఏమీ మిగల్లేదన్న అధ్యక్షుడు ఇరాన్పై యుద్ధానికి త్వరలో తెర దించుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంకేతాలిచ్చారు. బుధవారం ఈ మేరకు ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తమ దాడుల అనంతరం ఇరాన్లో ఇంకేమీ మిగల్లేదని అభిప్రాయపడ్డారు. ‘‘లక్ష్యం చేసుకోవడానికి ఇంకేమీ లేదక్కడ. యుద్ధం ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నీ దాదాపుగా నెరవేరినట్టే. కాబట్టి ఇక నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధానికి తెర పడుతుంది’’అని ఆక్సియోస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


