దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రెండు డ్రోన్లు కూలిన ఘటన కలకలం రేపింది. ఈ విషయాన్ని దుబాయ్ మీడియా కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఘటనలో భారతీయుడితో పాటు మొత్తం నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిలో ఇద్దరు ఘనా దేశానికి చెందిన వారు, ఒకరు బంగ్లాదేశ్కు చెందినవారు కాగా, మరో వ్యక్తి భారతీయుడు. వీరందరికీ స్వల్ప గాయాలే అయినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటన ప్రభావం విమానాల రాకపోకలపై పడలేదని అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో విమాన ట్రాఫిక్ సాధారణంగానే కొనసాగుతోందని తెలిపారు. ప్రయాణికులు తమ విమానాల వివరాల కోసం సంబంధిత ఎయిర్లైన్స్తో సంప్రదించాలని సూచించారు.
ఘటన అనంతరం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.


