‘ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు’ అని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తనకి ఏమి కావాలో ట్రంప్కు బాగానే తెలుసు. తెలియంది తల్మీజ్కే! ఇరాన్లో చమురు ఉంది. గ్యాస్ ఉంది. అది తనకి కావాలి. ఈ మాట మనం చెప్పడం కాదు; ట్రంపే స్వయంగా చెప్పాడు. 2019లో సిరియా యుద్ధం గురించి మాట్లాడుతూ ‘ఆ చమురు మనదే. దాన్ని మనమే ఉంచుకోవాలి అని నేను ఎప్పటినుంచో చెబు తున్నాను’ అని అన్నాడు. ఇరాన్ సుమారుగా 4,800 పై చిలుకు బావులున్న ప్రాంతం. వాటి మీద అనాదిగా అమెరికా కన్ను ఉంది.‘ఇరాన్ అణ్వాయు ధాల్ని తయారు చేస్తుంది అందుకే దాడుల్ని చేశాము’ అనేది పైకి చెప్పే మాట.
చమురు, గ్యాస్ ఉన్న ప్రాంతాలన్నిటినీ కబళించాలనేది అమెరికా చిరకాల వాంఛ. ఇరాక్, లిబియా, సిరియాల మీదా అందుకే దాడి చేసింది. అవి ఆక్రమణలోకి రాక పోవొచ్చు. అది వేరే సంగతి. ‘అవి రావు’ అని కూడా అమెరికాకు తెలుసు. కానీ తన ప్రయత్నం మానదు. అ ప్రయత్నం వల్ల కొంత లొంగుబాటు ఉంటుంది. రాజీలు ఉంటాయి. టెక్నాలజీ పేరుతో ప్రపంచంలో పెద్ద చమురు కంపెనీలైన ఎక్సోనా మొబైల్, చెవ్రోనా (అమెరికా), బీపీ (బ్రిటన్), షెల్ (నెదర్లాండ్), టోటల్ ఎనర్జీస్ (ఫ్రాన్స్) లాంటి కంపెనీలను అక్కడ దించుతుంది. ఎక్కువ కమి షన్లను రాబడుతుంది. ఇది ఇప్పటి కథ కాదు, అనాదిగా జరుగుతున్నది ఇదే!
ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో చమురు ఉంది. కానీ టెక్నాలజీ ఉండేది కాదు. 1940–1970 మధ్యకాలంలో ‘సెవెన్ సిస్టర్స్’ అని పెద్ద చమురు కంపెనీలు ఉండేవి. ఇవి ఆ యా దేశాల్లోకి వెళ్లి తక్కువ ధరలకే ఒప్పందాలు చేసుకుని, ఎక్కువ లాభం వేసుకునేవి. ఈ దోపిడీని భరించలేక, 1960లో కొన్ని చమురు దేశాలు కలిసి ‘ఒపెక్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సంస్థ ద్వారా చమురు ధరలపై ఆ యా దేశాల స్వయం నియంత్రణ పెంచడం, పాశ్చాత్య కంపెనీల ప్రభావాన్ని తగ్గించడం చేశాయి.
1973లో జరిగిన ఒక పెద్ద సంఘటన ప్రపంచ చమురు రాజకీయాలను పూర్తిగా మార్చింది. దీనిని ‘చమురు ఆయుధం (ఆయిల్ వెపన్)’ అని అంటారు. 1973లో మధ్యప్రాచ్యంలో ‘యోమ్ కిప్పూర్’ పేరుతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చింది. దానికి ప్రతిగా చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు ‘అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు చమురు అమ్మకాలు ఆపివేయాలి’ అని ఒక నిర్ణయం చేశాయి. దీంతో ప్రపంచంలో పెద్ద సమస్య వచ్చింది: చమురు ధర 4 రెట్లు పెరిగింది. ఈ యుద్ధం వలన కూడా మళ్లీ అలాంటి సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు!
– నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త


