గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా సహా ఏడు దేశాల సైనిక సాయం కోరారు. ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు యుద్ధ నౌకలను పంపాలని విజ్ఞప్తి చేశారు. సాయం అందించేందుకు వెనుకడుగు వేస్తున్న మిత్రదేశాలను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సాయం చేయని వారిని గుర్తుంచుకుంటామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
పట్టీపట్టనట్లున్న చైనా
ట్రంప్ పిలుపు విషయంలో చైనా పట్టీపట్టనట్లు ఉంది. వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, హర్మూజ్ ప్రాంతంలో సైనిక చర్యలు తక్షణమే నిలిపివేయాలని బీజింగ్ కోరింది. చైనా అధికారిక స్పందన ఆధారంగా ఈ నెల చివర్లో జరగాల్సిన ట్రంప్ చైనా పర్యటన ఉండే అవకాశం ఉంది.
ఆచితూచి అడుగులు వేస్తున్న ఐరోపా దేశాలు
హర్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ పిలుపుపై ఐరోపా దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికా అభ్యర్థనపై జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. యుద్ధం యొక్క తుది లక్ష్యం ఏమిటో స్పష్టత ఇవ్వాలని జర్మనీ సహా అనేక దేశాలు అమెరికాను కోరాయి.
ఈ యుద్ధంలోకి లాగబడటానికి తాము ఆసక్తిగా లేమని యుకే ప్రధాని కియార్ స్టార్మర్ స్పష్టం చేశారు. మరోవైపు రెడ్ సీలో నౌకల రక్షణ కోసం జరుగుతున్న మిషన్ను హర్ముజ్ వరకు విస్తరించే అంశంపై యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోన్నట్లు తెలుస్తుంది.
వెనక్కు తగ్గని ఇరాన్
ఇరాన్ మిసైల్ లాంచర్లలో 70 శాతం ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిజ్బుల్లా ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ లెబనాన్లోకి అదనపు భూసేనలను పంపింది. దక్షిణ లెబనాన్లో జరిగిన దాడిలో ముగ్గురు మరణించారని సమాచారం.


