ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్త యుద్ధం. ఇది గత కొన్ని రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూ సహకరిస్తున్న అరబ్ దేశాలపై ఇప్పటికే ఇరాన్ విరుచుకుపడుతూ ఉంది. తమతో యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే వారు తమ శత్రువులేనని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఆ క్రమంలోనే వారిపై భీకరమైన దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
విదేశాలకు సరఫరా అయ్యే చమురు విషయంలో కూడా ఇరాన్ కఠినంగానే ఉంది. ఇరాన్కు నచ్చిన దేశాలను మినహాయించి మిగతా దేశాలను కట్టడి చేస్తోంది. ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే చమురు నౌకల విషయంలో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే దీన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఆందోళన మొదలైంది.
ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమైన చోక్పాయింట్గా చెప్పుకుంటారు. మరి దీన్ని ఇరాన్ పూర్తిగా క్లోజ్ చేస్తే ఏంటనేది పరిస్థితి. ఇదే ఇప్పుడు ట్రంప్లో మొదలైన భయం.
మీ నౌకలను పంపండి
హర్మూజ్ జలసంధి భద్రతపై తీవ్ర ఆందోళనలు నడుమ ట్రంప్.. ప్రపంచ దేశాలకు ఒక పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధి భద్రతకు సంబంధించి పలు ఇతర దేశాల నౌకలను పంపమని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకేలకు ఆయన తన సందేశాన్ని పంపారు. ఈ జలసంధితో ఇబ్బంది తలెత్తితే ఎక్కువగా ప్రభావితమయ్యేది ఆయా దేశాలేనని అందుచేత ముందస్తు జాగ్రత్తగా ఆ జలసంధి భద్రతకు నౌకాదళాన్ని సిద్ధం చేసుకుని పంపాలన్నారు. ఇలా చేస్తే ముప్పు ఉండదని, లేకపోతే అతి తీవ్రమైన సంక్షోభాన్ని కూడా చూడాల్సి రావచ్చన్నారు. వారంతా హర్మూజ్ జలసంధి అంశంలో ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.


