అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపునకు అమెరికా పంపిన ప్రతిపాదనలను కేవలం తమ దేశ నాయకత్వం పరిశీలిస్తుందని తెలిపారు. వీటిని ఎట్టిపరిస్థితుల్లో చర్చలు అనుకోకూడదని తేల్చిచెప్పారు.
ఇరాన్పై యుద్దం చేసి తన లక్ష్యాలను చేరుకోవడంలో అమెరికా విఫలమైందని అరాగ్చీ విమర్శించారు. సులభంగా విజయం సాధించాలని, లేదా ఇరాన్లో ప్రభుత్వ మార్పు చేయాలని ట్రంప్ కలలు కన్నారని కానీ అవి నెరవేరలేదని తెలిపారు. అందుకోసమే అగ్రరాజ్యం బేరానికి వస్తుందని విమర్శించారు.
ప్రస్తుతం యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనలను ఇరాన్ పరిశీలిస్తోందని అయితే మధ్యవర్తలు ద్వారా మాత్రమే ఆ సందేశాలు పరిశీలిస్తున్నామని అంతేగానీ చర్చలు జరపడం లేదని తేల్చిచెప్పారు. దేశ భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తేలేదన్నారు.
ఇరాన్ను ఎవరూ బెదిరించలేరని విషయాన్ని ఇదివరకే ప్రపంచానికి చాటి చెప్పామని, తమ దేశం యొక్క దృఢత్వాన్ని నిరూపించుకున్నామని తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధాన్ని కొనసాగించాలని తాము కోరుకోవడం లేదని, అయితే తమ నిబంధనలకు అనుగుణంగా శాశ్వత పరిష్కారాన్ని మాత్రమే ఆశిస్తున్నట్లు అరాగ్చీ తెలిపారు.


