మేం ఇప్పటికి వరకు పాత ఆయుధాలే వాడాం.. కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేరంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందంటూ హెచ్చరించింది. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేము ముగిస్తామన్న ఇరాన్.. ప్రతీకారం దారుణంగా ఉంటుందని తెలిపింది. వేలాది మంది సైనికులు మరణించారని ఇరాన్ ప్రకటించింది.
కాగా, అమెరికాను కొట్టగల మిసైళ్లను ఇరాన్ సిద్ధం చేస్తోందన్న ట్రంప్.. అందుకే అమెరికా సైన్యం ఇరాన్పై దాడులు చేపట్టిందన్నారు. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులు అంటూ చెప్పుకొచ్చారు. ఇరాన్ మద్ధతుతోనే హామాస్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇరాన్లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని అంతం చేస్తాం. ఇరాన్ నావికా దళాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా బేస్ క్యాంప్లే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. ఒకేసారి 10 దేశాలపై మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ, అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఇ, ఇరాక్, దుబాయ్పై ఇరాన్ దాడులకు దిగింది. దాబాయ్ టార్గెట్గా దాడులు చేస్తోన్న ఇరాన్.. ఆ దేశంపై వరుసగా మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో బుర్జ్ ఖలిఫాను అధికారులు ఖాళీ చేయించారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ రైట్ హ్యాండ్ జనరల్ అలీ ఖంబాని హతం కాగా, ఇరాన్కు చెందిన పలువురు సినియర్ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం.


