ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా తెరచాటున సాగుతున్న షాడో వార్ ఇప్పుడు బాహాటంగా రణక్షేత్రంలోకి మారింది. ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ నేడు బద్ధశత్రువులుగా మారాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సమస్య ఎక్కడ మొదలైంది? అగ్రరాజ్యం అమెరికా ఈ గొడవలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందో చూద్దాం.
శత్రుత్వానికి పునాదులు
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ, ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమీకరణాలను మార్చేసింది. ఇరాన్లో రాజు మహమ్మద్ రెజా షా పహ్లవీ అమెరికా మద్దతుతో దేశాధినేత పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. ఇది సంప్రదాయ ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. షా తన రహస్య పోలీసు దళంతో తనపై వ్యతిరేక స్వరాలను అణచివేసేవారు. దీంతో స్థానికంగా అసంతృప్తి పెరిగింది. దేశంలో చమురు సంపద పెరిగినప్పటికీ, అది సామాన్య ప్రజలకు చేరడం లేదని, కేవలం సంపన్నులకే లాభం చేకూరుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొసాద్దెగ్ను అమెరికా తొలగించి షాను గద్దెనెక్కించడంపై ఇరానియన్లలో తీవ్ర వ్యతిరేకత ఉండేది.
అప్పటి విప్లవం ఎలా జరిగింది?
ఈ విప్లవంలో ప్రధాన నాయకుడు అయాతొల్లా రుహొల్లా ఖొమేనీ.. షా విధానాలను విమర్శించినందుకు ఆయనను 1964లో దేశం నుంచి బహిష్కరించారు. తాను ఫ్రాన్స్ నుంచి ఆడియో క్యాసెట్ల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలు పంపేవారు. 1978లో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, సమ్మెలు మొదలయ్యాయి. సైన్యం ప్రజలపై కాల్పులు జరిపినా ఉద్యమం ఆగలేదు. పరిస్థితి చేజారిపోవడంతో 1979 జనవరిలో షా పహ్లవీ దేశం విడిచి పారిపోయారు. 1979 ఫిబ్రవరిలో ఖొమేనీ ఇరాన్ చేరుకున్నారు. ఏప్రిల్లో జరిగిన రెఫరెండం ద్వారా ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది.
విప్లవం తర్వాత ఏం జరిగింది?
దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ (మత పెద్ద) చేతిలోనే తుది నిర్ణయ అధికారం ఉండేలా రాజ్యాంగం మారింది. 1979 నవంబర్లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసి 52 మంది దౌత్యవేత్తలను చాలా రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి అమెరికా-ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ముస్లిం పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఖొమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒక అక్రమ దేశం అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న హమాస్ (గాజా), హిజ్బుల్లా (లెబనాన్), హూతీలు (యెమెన్) వంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోందనే వాదనలున్నాయి. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాలుగా మారింది.
అణు బాంబు భయం
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణు బాంబులు ఉంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.
అమెరికా ఎందుకు మధ్యలోకి వచ్చింది?
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే, అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు, దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి.
చమురు సంక్షోభం
ఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకం.
ప్రాంతీయ ఆధిపత్యం
ఇరాన్ విస్తరణ వాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా, చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది.
అణ్వాయుధ నియంత్రణ
ఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.
తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్లోని క్షిపణి కేంద్రాలపై భారీ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతం కావడంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. అమెరికా తన నావికా దళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించి ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్నది కాదు. ఇది సిద్ధాంతాలకు, ప్రాంతీయ ఆధిపత్యానికి, భవిష్యత్ అణు భద్రతకు మధ్య జరుగుతున్న పోరాటమని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు


