తీరు మార్చుకోకపోతే అంతే సంగతి!
అమెరికా రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న భారత సంతతి ప్రజలు (ఇండో అమెరికన్లు) డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? భారత్తో సంబంధాలను నెరపడంలో ట్రంప్ కంటే అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాలు మెరుగని భావిస్తున్నారా? అంటే అవుననే అంటోంది ప్రతిష్టాత్మక ‘కార్నెగీ ఎండోమెంట్’ సర్వే. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇండో-అమెరికన్లలో ఆయనపై వ్యతిరేకత పెరగడం చర్చనీయాంశమైంది.
సర్వే ఏం చెబుతోంది?
‘ఇండియన్–అమెరికన్ యాటిట్యూడ్ సర్వే’ పేరుతో ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ చేసిన ఈ సర్వేలో ఫలితాల ప్రకారం.. దాదాపు 71 శాతం మంది భారత సంతతి ప్రజలు ట్రంప్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్తో సంబంధాల విషయంలోనూ 55 శాతం మంది ఆయన తీరును తప్పుబడుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ట్రంప్ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తుండటం గమనార్హం.
బైడెన్ ఎందుకు మెరుగనిపిస్తున్నారు?
జో బైడెన్ తన పదవీ కాలంలో భారత్తో సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా చూశారని మెజారిటీ ఇండో-అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐ-సీఈటీ) ద్వారా రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్కు బైడెన్ అండగా నిలిచారు. బైడెన్ హయాంలో వీసా విధానాలు (హెచ్1బీ), కమలాహారిస్ వంటి వారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం ద్వారా భారత సంతతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.
ట్రంప్ 2.0.. పెరిగిన ఆందోళనలు
ట్రంప్ మొదటి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండో-అమెరికన్లలో అసహనాన్ని పెంచుతున్నాయి.
భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై భారత్ను హెచ్చరించడం వంటి అంశాలు కేవలం ఇచ్చిపుచ్చుకోవడమనే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.
‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.
ట్రంప్ హయాంలో ఆన్లైన్ విద్వేషం, వర్ణ వివక్ష పెరిగిందని సగం మందికి పైగా భారత సంతతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు


