మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్న నేపథ్యంలో జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఇజ్రాయిల్ను వదిలి వెళ్లాలంటూ అమెరికా రాయబారి మైక్ హకబీ.. రాయబార కార్యాలయ సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
వీలైనంత త్వరగా..
ఇవాళ(శుక్రవారం) ఉదయం.. యూఎస్ రాయబార ఉద్యోగులకు ఒక మెయిల్ పంపించారు. ‘ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు.. కానీ వెళ్లాలనుకునే వారు వీలైనంత త్వరగా విమానాలు బుక్ చేసుకోవడం మంచిదంటూ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా దాడులు చేయకముందే ఇజ్రాయెల్ వీడాలని తెలిపారు. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమవుతుందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి.
పశ్చిమాసియా దేశాల ఆందోళన
తమతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలను తప్పవంటూ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా రాయబారి ఇజ్రాయెల్లోని తమ ఎంబసీకి తాజా ఆదేశాలు చేయడం కలకలం రేపుతోంది. ఇరాన్పై అమెరికా దాడులు చేసే అవకాశముందని పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
టెన్షన్.. టెన్షన్..
మరోవైపు, ఒక వేళ ఇరాన్పై దాడి జరిగితే.. అమెరిక స్థావరాలపై కూడా ఇరాన్ ప్రతి చర్య దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూస్ మోహరించింది. పలు సైనిక స్థావరాల్లో దాదాపుగా 10 వేల మంది యూఎస్ సైనికులు మోహరించారు. ఇరాన్పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్ తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్హౌజ్ వర్గాలు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్ అప్రమత్తం
ఇరాన్ అణు కార్యక్రమాలు, అంతర్గత అణచివేతపై ట్రంప్ సీరియస్గా ఉన్నారని.. దీంతో ఇరాన్పై అమెరికా భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం కన్నా భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండవచ్చని తాజా నివేదికలు కూడా చెబుతున్నాయి. మరో వైపు అమెరికా తమపై దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు తాము ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సైతం అప్రమత్తమైంది.
కాగా, అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయం అంటూ ఆయన ట్రంప్ను హెచ్చరించారు.


