సాక్షి,బళ్లారి: తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యే విజయపుర ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ మరోసారి నోరు జారారు. గురువారం హనుమజ్జయంతిని పురస్కరించుకుని విజయపురలో శ్రీఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. తనకు ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం వస్తే తన మొదటి సంతకం ముస్లింలను మైనార్టీ హోదా నుంచి తీసేసే ఫైల్పైనే చేస్తానని ఘాటుగా అన్నారు. అదే సందర్భంలో బ్రాహ్మణులు, మరాఠీయులు, క్షత్రియులను మైనార్టీ జాబితాలో చేరుస్తానన్నారు. బీజేపీలోకి మళ్లీ చేర్పించుకోవాలని తాను ఎప్పటికీ కోరనన్నారు. అయితే వారంతకు వారే తండ్రీ, కుమారులను పార్టీ నుంచి బహిష్కరించి, తనను బీజేపీలోకి పిలిస్తే వెళతానన్నారు.
అధికారులకు ముఖ్యమంత్రి పతకాలు
హొసపేటె: విజయనగర జిల్లాకు చెందిన నలుగురు పోలీస్ అధికారులు, సిబ్బందికి గురువారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదగా పతకాలను అందజేశారు. హరపనహళ్లి డీఎస్పీ డాక్టర్ సంతోష్ చౌహాన్, హూవినహడగలి పోలీస్ స్టేషన్ సీఐ దీపక్ బూసరెడ్డి, టీబీ డ్యాం ఎస్ఐ కోదండపాణి, హరపనహళ్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆనంద్ పతకాలను అందుకున్నారు.
భారీ పరిశ్రమల ఏర్పాటు తగదు
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తగదని పరిశ్రమల రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం కొప్పళ నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన శిబిరం వద్దకు వచ్చిన అధ్యక్షుడు బెట్టదూరు ప్రసంగించారు. ఈ ప్రాంతంలో విషకార పదార్థాలను వెదజల్లే పరిశ్రమలను స్థాపించి మానవాళి జీవితాలను అనారోగ్యం పాలు చేయడం సరికాదన్నారు. బల్డోటా, కిర్లోస్కర్, కళ్యాణి స్టీల్, ముక్కుంద సుమి, ఎక్సో ఇండియా కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితమే మానవుడి ఆయుష్షు క్షీణిస్తుందన్నారు. మంజునాథ్, మదరి, హన్మంతప్ప, మల్లికార్జున, గురునాథ్ గౌడ, విరుపణ్ణ, వీరభద్రప్ప, పుష్పలత, నాగరాజ్ భరమన్నలున్నారు.
కూతురిపై అఘాయిత్యం.. తల్లిదండ్రుల అరెస్ట్
రాయచూరు రూరల్ : కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఘటన బెళగావిలో చోటు చేసుకుంది. మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతురిని రక్షించాల్సిన తండ్రి మైనర్ బాలికపై అత్యాచారం చేస్తుండడం, అందుకు భార్య మద్దతు పలకడంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బెళగావి జిల్లా ఎస్పీ వెల్లడించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. బెళగావిలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న రాజశేఖర్, భార్య దానమ్మలకు కూతురు, కుమారుడు సంతానం. అయితే ఎవరికీ తెలియకుండా మైనర్ బాలికపై నిరంతరం అత్యాచారానికి పాల్పడుతుండటంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి నిందితులను అరె్స్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.


