వెట్టి పద్ధతిని నిర్మూలిద్దాం
చెళ్లకెరె రూరల్: ఇప్పటికీ అక్కడక్కడా కొనసాగుతోన్న వెట్టి(జీత) పద్ధతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని సివిల్ న్యాయమూర్తి బీఆర్ పునీత్ పేర్కొన్నారు. ఆయన స్థానిక సీనియర్ కళాశాలలో న్యాయ సేవా సమితి, న్యాయవాదుల సంఘం, ధార్మిక శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జీత పద్ధతి నిర్మూలన దినాచరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జీత పద్ధతి నిర్మూలనకు విద్యార్థులకు జాగృతి అవసరం. ఈ పద్ధతి సామాజికంగానే కాకుండా చట్టపరంగా అపరాధం అన్నారు. జీత పద్ధతి కొనసాగిస్తున్న వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ విషయంపై జాగృతి కల్పించి జీత పద్ధతికి విముక్తి పలకాలన్నారు. న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు శ్యామల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీత పద్ధతి విభిన్న రూపాల్లో వెలుగులోకి వచ్చిందని, దాన్ని అరికట్టడానికి చట్టపరంగా జాగృతి కార్యక్రమాలు నిరంతరంగా జరపాలన్నారు. తహసీల్దార్ రెహన్బాషా, తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జీఆర్ అశ్వత్ నాయక్, తాలూకా విద్యాశాఖ అధికారి కేఎస్ సురేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


