బెంగళూరు: ఆటోడ్రైవరు బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయల బ్యాలెన్సు ఉంది. భారీగా డబ్బులు వచ్చిపడుతున్నాయి. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథకు బ్రేక్ పడింది. ఈ సంఘటన హుబ్లీ నగరంలో జరిగింది. కేశ్వాపురలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఒక ఖాతాదారు అకౌంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయల అక్రమ నగదు బదిలీ అయినట్లుగా వెలుగు చూసింది. ఈ ఖాతా ఓ ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ది. సమాచారం అందుకున్న హుబ్లీ– ధార్వాడ పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతని ఖాతాకు దేశంలోని వివిధ బ్యాంక్ల ఖాతాల నుంచి డబ్బులు వరదలా వచ్చి పడ్డాయి. గత రెండేళ్ల నుంచి ఈ ఖాతా చురుగ్గా ఉండగా, స్కాం వెలుగు చూడగానే ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతా సంఖ్య– 54910200000346 గా తెలిపారు.
ఖాతాదారుల ఫిర్యాదుతో కదిలిన డొంక
సైబర్ నేరాల్లో డబ్బులు పొగొట్టుకున్న పలువురు బాధితులు 1930 సైబర్క్రైం హెల్ప్లైన్కు కాల్ చేసి ఫలానా ఖాతాకు తమ డబ్బులు అక్రమంగా జమ అయినట్లు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో ఆరా తీయగా ఇర్ఫాన్ డొంక కదిలింది. కుక్కింగ్ విత్ కేటరింగ్ అనే పేరుతో ఈ ఖాతా ఉంది. సుమారు 50 సార్లకు పైగా వివిధ ఖాతాల నుంచి డబ్బు జమ అయింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సైబర్ మోసాల బాధితుల డబ్బు ఈ ఖాతాకే చేరింది.
తనిఖీలో 16 పాస్ పుస్తకాలు దొరికాయి
ఏసీపీ శివరాజ్ కటకబావి మీడియాతో మాట్లాడుతూ గోపనకొప్ప ఇర్ఫాన్ కాగినెలె అనే వ్యక్తి ఖాతాకు ఎక్కడెక్కడి నుంచో డబ్బు వస్తోందన్నారు. అతని ఇంట్లో తనిఖీ చేయగా 16 బ్యాంక్ పాస్ పుస్తకాలు దొరికాయని చెప్పారు. ఎంత మేర డబ్బులు బదిలీ అయ్యాయి. ఏయే మార్గాల్లో వచ్చాయి? అని బ్యాంక్ అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.


