ట్రావెల్స్ యజమాని.. దొంగావతారం
బనశంకరి: రాత్రి వేళల్లో ఇళ్లలోకి దూరి చోరీల చేసే ఘరానా దొంగలను బెంగళూరు బైయప్పనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుంచి రూ.1.84 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దావణగెరె జిల్లా హరిహర తాలూకా నివాసి రాజు (43) పట్టుబడిన దొంగ. దావణగెరెలో ట్రావెల్స్ నిర్వహించే రాజు కరోనా సమయంలో తీవ్ర నష్టాలు రావడంతో దొంగగా మారాడు. మాస్కు ధరించి ఇంట్లోకి చొరబడి నగదు, నగలు కొట్టేసేవాడు. ఇప్పటివరకు 10 చోరీ కేసులు ఇతనిపై ఉన్నాయి. గత నెల 18వ తేదీన ఓ కుటుంబం ఊరికి వెళ్లగా రాజు తలుపు బద్దలుకొట్టి బీరువాలో ఉన్న 783 గ్రాముల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకుని ఉడాయించాడు. ఈ కేసులో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి అబ్బిగెరెలో పట్టుకున్నారు. నగలను కమ్మగొండనహళ్లి, అబ్బిగెరె, హెచ్ఎంటీ లేఔట్లో జువెలరీ దుకాణాల్లో అమ్మినట్లు చెప్పాడు. జాలహళ్లి, గోవాలోనూ విక్రయించానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆయా వ్యక్తుల నుంచి 1.2 కేజీల బంగారం నగలు, వెండి సొత్తు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
24 మంది విక్రేతల అరెస్టు, రూ.2 కోట్ల డ్రగ్స్ జప్తు
యశవంతపుర: సిలికాన్ సిటీలో పోలీసులు దాడులు చేసి 24 మంది డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసి 2.08 కోట్ల విలువగల హైడ్రో గంజాయి, చరస్, ఎండిఎంఎ అనే మత్తు పదార్థాలను జప్తు చేశారు. ఐదుమంది అంతరాష్ట్ర నిందితులు కాగా, మిగిలిన 19 మంది బెంగళూరువాసులు. 1.23 కేజీల హైడ్రో గంజాయి, 36 కేజీల మామూలు గంజాయి, 11.6 కేజీల చరస్, 121 గ్రాముల ఎండిఎంఎ దొరికిందని పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ తెలిపారు. కుమారస్వామిలేఔట్, హెబ్బాళ, జేసీ నగర, బసవనగుడి, గోవిందరాజనగర, చామరాజపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దాడులు జరిపారు. డ్రగ్స్ వ్యాపారులపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
ఇళ్లలో చోరీలపర్వం
1.2 కేజీల నగలు స్వాధీనం


