ముల్లంగి రైతు పొలానికి దారి
● సర్వే చేసి పరిష్కరించిన అధికారులు
● ఇటీవల ఆఫీసులో నిరసన
తుమకూరు: పొలానికి దారి చూపాలని అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా, లంచం ఇవ్వాలని సతాయించడంతో రైతు ముల్లంగి పంటే లంచంగా ఇస్తానని తహసీల్దారు ఆఫీసులో ధర్నా చేయడం తెలిసిందే. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మధుగిరి తాలూకా దొడ్డేరి వద్ద జక్కెనల్లికి చెందిన రైతు ప్రసన్న కుమార్ దుస్థితి తీరింది. ఫిబ్రవరి 4న సాక్షి వార్తాపత్రికలోనూ ప్రముఖంగా అతని ఆవేదన ముద్రితమైంది. ఈ నేపథ్యంలో మేలుకున్న రెవెన్యూ అధికారులు జయప్రకాష్, గ్రామ అకౌంటెంట్, శరణు, సర్వే అధికారులు ఒక్క రోజులోనే రైతు పొలాన్ని పరిశీలించారు. సర్వే నిర్వహించి దారిని ఏర్పాటు చేశారు. దీంతో రైతు అధికారులకు, విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. తన నిరసనకు న్యాయం జరిగిందని అన్నాడు. వారంరోజుల్లో దారి చూపకుంటే తహసీల్దారు ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపాడు.
జేసీబీతో పొలానికి దారి వేస్తున్న అధికారులు


