బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు దుర్మరణం
● 12 మందికి గాయాలు
● దేవదుర్గ తాలూకాలో ఘటన
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా 12 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని దేవదుర్గ తాలూకా తింథిణి బ్రిడ్జి నుంచి దేవదుర్గకు వస్తుండగా మార్గమధ్యంలో కరేగుడ్డ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. ఆటోను అతి వేగంగా ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించగా, బస్సు ఆటోను ఢీకొట్టడంతో మల్లప్ప(60) అక్కడికక్కడే మృతి చెందారు. మోనమ్మ (65) విమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు కాగా వారిని దేవదుర్గ తాలూకా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హొసకెరప్ప వెల్లడించారు.
టిప్పర్ దూసుకెళ్లి వ్యక్తి మృతి
రాయచూరు రూరల్: టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాయచూరు జిల్లాలో మాన్వి ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. మాన్వి తాలుకా మాడగిరికి చెందిన శరణప్ప గౌడ(55) మరణించారు. బ్యాంక్లో పని ముగించుకుని ద్వి చక్ర వాహనంపై వెళుతుండగా జారి పడడంతో టిప్పర్ వెనుక చక్రం కింద పడడంతో దేహం ఛిద్రంగా మారిందని పోలీసులు తెలిపారు. మాన్వి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్ కెంచరెడ్డి తెలిపారు.
కర్తవ్య లోపంపై సీఐ సస్పెండ్
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర వలయం ఐజీపీ చేతన్ సింగ్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. బాగల్కోటె జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్ సీఐ హెచ్.ఆర్.పాటిల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా సస్పెన్షన్కు గల కారణాలను గోప్యంగా ఉంచారు. కాగా తనను సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం తెలియదని సీఐ పాటిల్ తెలిపారు.
ఎస్పీ, టీఎస్పీ నిధులు పెంచాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ఎస్పీ, టీఎస్పీ నిధులను 24 శాతం పెంచాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు హనుమంతప్ప మాట్లాడారు. గతంలో నిధులను పంచ గ్యారంటీలకు వినియోగించడాన్ని తప్పుబట్టారు. భూమి లేని వారికి మిగులు భూములు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు వేతనాలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతిపత్రాన్ని స్థానికాధికారికి సమర్పించారు.
గ్రామీణ విలేకరులకు బస్సుపాస్ల పంపిణీ
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలో సంచరించే పాత్రికేయులకు బస్సుపాస్లు పంపిణీ చేశారు. సోమవారం కలబుర్గి డివిజన్ వార్త శాఖాధికారి కార్యాలయంలో వార్త శాఖాధికారి జడియప్ప వీటిని పంపిణీ చేసి మాట్లాడారు. వార్తలు సేకరించడానికి బస్ పాస్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బస్సు పాస్లను దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో వారి పాస్లను రద్దు చేస్తామన్నారు. అధికారులు ఉమా శంకర్, రాజరత్నం, మహాదేవి, పాషాలున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే దర్బార్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలోని రైతులు భూములను రిజిస్టర్ చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే అవినీతి కూపంలో మునిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో అడుగు పెట్టగానే ప్రైవేట్ వ్యక్తుల దర్బార్ నడుస్తోంది. నగరంలోని కార్యాలయంలో అధికారుల కంటే మధ్యవర్తులు పెత్తందారీతనం చూపుతున్నారని తెలిపారు. కార్యాలయం ముందు భాగంలో టేబుళ్లు, బెంచీలు వేసుకొని రాజఠీవి ప్రదర్శిస్తూ ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బు లాగుతున్నారని, అధికారులకు వాటా ఉందని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు దుర్మరణం
బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు దుర్మరణం
బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు దుర్మరణం


