హుండీ చోరీ
హొసపేటె: మునిరాబాద్ సమీపంలోని హోసలింగపుర గ్రామంలోని కరుమారియమ్మ దేవి ఆలయం, కాళికా దేవి ఆలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీ చేశారు. కాళికా దేవి దేవస్థానం ముందు ఉన్న గ్రిల్ తాళాన్ని దొంగలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే గ్రామంలోని 3వ వార్డులోని తుంగభద్ర ఎడమ ఒడ్డున ఉన్న ఆలయంలోని దేవత మెడలోని 6 గ్రాముల బంగారు తాళి గొలుసు, హుండీలోని ఉన్న నగదు, పూజా సామగ్రిని దొంగిలించి పరారయ్యారు. దొంగలు కిటికీ పగలగొట్టి ఆలయంలో ప్రవేశించారు. ఈ ఘటనపై మునీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జేడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా తాయన్న
బళ్లారి అర్బన్: జనతాదళ్ (సెక్యులర్) పార్టీ బళ్లారి జిల్లా అధ్యక్షుడిగా మీనళ్లి తాయన్నను మూడోసారి నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డి. కుమార స్వామి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమార్ స్వామి తదితరులు నూతన జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయన్నకు నియామక పత్రాన్ని అందజేశారు. బళ్లారి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు బండెప్ప కాశంపూర్, నాడగౌడ, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ పాల్గొన్నారు.
‘నిన్న నెనపలి’ పుస్తకావిష్కరణ
బళ్లారి అర్బన్: యువ జీవితంలోని ఉత్సాహం నిరంతరం కొనసాగాలని హ్యాలిస్ బ్లూస్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు కేఎం.శివమూర్తి అన్నారు. అఖండ బళ్లారి జిల్లా కన్నడ సాహిత్య పరిషత్, వివేక పుస్తక ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నడ భవన్లో కవి ఎస్.ఆర్.శరణ్కుమార్ తొలి హనిగవన సంకలనం నిన్న నెనపలి పుస్తకావిష్కరణ జరిగింది. శాసన మండలి సభ్యుడు వై.ఎం.సతీష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బళ్లారి జిల్లా కసాప అధ్యక్షుడు డాక్టర్.నిష్టి రుద్రప్ప కృతిని పరిచయం చేస్తు నిన్ననెనపలి ద్వారా శరణ్ కుమార్ కన్నడ కవిత్వ ప్రపంచానికి తొలి కృతిని అందించడం ప్రశంసనీయమన్నారు. కృతిలోని హనిగవనాలు పాఠకుల మనోభావాలకు అనుగుణంగా యువ వయస్సు జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసి ఆనందం కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వివేక పుస్తక ప్రచురణ సంస్థ ప్రతినిధులు ఎస్.ఆర్.రాజేశ్వరి, ఎస్.ఆర్.సిద్ధరామన గౌడ, ఎస్.ఆర్. చంద్రశేఖర్ పాటిల్, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, బసవరాజ్ గడగిన్, కసాప గౌరవ కార్యదర్శి డాక్టర్.కే.శివలింగప్ప, ఎరేగౌడ, డాక్టర్ భ్రమరాంభ యాటి తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలోకి దూసుకెళ్లిన బస్సు
రాయచూరు రూరల్: మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం రాత్రి దేవదుర్గ తాలుకా తింథిణ మౌనేశ్వర ఆలయం వద్ద చోటుచేసుకుంది. దేవదుర్గ డిపోకు చెందిన డ్రైవర్ అంబరేష్ పూటుగా మద్యం సేవించి డ్యూటీకి వచ్చాడు. మద్యం మత్తులో స్టీరింగ్ను పక్కకు తిప్పడంతో బస్సు తింథిణ మౌనేశ్వర ఆలయంలోకి దూసుకెళ్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అగ్ని ప్రమాదంలో
శనగ పంట దగ్ధం
హొసపేటె: కొప్పళ తాలూకా బాలగేరి గ్రామంలో రైతు రామప్ప హోంబలేకు చెందిన శనగ పంట, పొట్టు ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నష్ట పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.
హుండీ చోరీ
హుండీ చోరీ
హుండీ చోరీ
హుండీ చోరీ


