అన్నదాత ఆత్మహత్య
● ఫైనాన్స్ వేధింపులే కారణం
యశవంతపుర: ఫైనాన్స్లో తీసుకున్న అప్పు కట్టనందుకు ఇంటిని సీజ్ చేస్తామని బెదిరించడంతో రైతన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్ జిల్లా శ్రవణ బెళగోళ తాలూకా కొత్తనఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. రైతు యోగేశ్ (50) చన్నరాయపట్టణలోని ఫైనాన్స్ సంస్థలో రూ.7 లక్షల రుణం తీసుకున్నాడు. నెల నెలా తప్పక కంతు కడుతుండేవాడు, అయితే ఇబ్బందులు రావడంతో 2 నెలలుగా చెల్లించలేకపోయాడు. 4న యోగేశ్ ఇంటికి వెళ్లిన ఇద్దరు ఫైనాన్స్ ఉద్యోగులు.. అప్పు కట్టలేదని కాబట్టి నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్స్ల ఆగడాలపై కుటుంబీకులు, గ్రామస్థులు అక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


