మెట్రో రైలులో చార్జీల బాదుడు
బనశంకరి: బెంగళూరు మెట్రో రైళ్ల టికెట్ రేట్లను 5 శాతం పెంచుతూ బీఎంఆర్సీఎల్ గురువారం ఆదేశాలు జారీచేసింది. 9వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. గత ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 101.5 శాతం చార్జీలను పెంచడంతో అన్నివర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో వెంటనే 71.5 శాతానికి తగ్గించింది. మెట్రో ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు మళ్లీ 5 శాతం చార్జీలను బాదుతూ అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంతో రోజువారీ ప్రయాణికులు, నగరవాసులు హడలిపోయారు.
మెట్రో చార్జీలు కనీసం రూ.1 నుంచి గరిష్టంగా రూ.5 వరకు పెరిగాయి. 2023–24తో పోలిస్తే 2024–25లో మెట్రో సంస్థ నిర్వహణ వ్యయం 10.20 శాతం పెరిగిట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది చాలా ఎక్కువేనని, కానీ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా టికెట్ ధర పెంపును 5 శాతానికి పరిమితం చేసినట్లు బీఎంఆర్సీఎల్ చెప్పడం గమనార్హం.
2017లో పెంపు తరువాత గత ఏడాది మెట్రో టికెట్ ధరలను భారీగా విస్తరించారు. అది ఒకేసారి 100 శాతం కావడంతో ప్రజలతో పాటు అన్ని పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెంపునకు మీరంటే మీరు కారణమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మెట్రో స్టేషన్ల వద్ద ధర్నాలు చేయడం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఆందోళనలకు సిద్ధమైనట్లు తెలిసింది. చార్జీలను సవరిస్తే మెట్రో స్టేషన్ వద్ద బైఠాయిస్తానని ఇటీవల నగర బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రకటించడం తెలిసిందే. చార్జీల పెంపుతో మాకు సంబంధం లేదని రాష్ట్ర సీఎం, డీసీఎంలు గతంలో ప్రకటించారు. చివరకు ప్రజల నెత్తిన మాత్రం భారం పడుతోంది. సోషల్ మీడియాలో చార్జీల బాదుడుపై తీవ్ర ఆక్రోశం వ్యక్తమౌతోంది.
అనుకున్నట్లే 5 శాతం పెంపు
ఈ నెల 9 నుంచి అమల్లోకి
నిర్వహణా వ్యయం నెపం
ప్రయాణికులపై మరింత భారం
పెంచాక ఇలా...
2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరమైతే రూ.10 ఉన్న చార్జీ రూ.11 అవుతుంది. 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరమైతే రూ.90 ఉన్న టికెట్ ధర రూ.95 కానుంది. చార్జీల పెంపు వన్ డే, త్రీ డే, ఐదు రోజుల పాస్లతో పాటు ప్రవాసీ కార్డులు, గ్రూప్ టికెట్లకు వర్తిస్తుందని బీఎంఆర్సీఎల్ తెలిపింది. కొన్ని కార్డులకు ఉన్న రాయితీలు కొనసాగుతాయని పేర్కొంది.
తక్కువే పెంచారట..
గతంలో 100 శాతం బాది..
మెట్రో రైలులో చార్జీల బాదుడు
మెట్రో రైలులో చార్జీల బాదుడు


