బడ్జెట్ కూర్పుపై సీఎం చర్చలు
బనశంకరి: శాసనసభ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్ తయారీపై కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి మార్పు గందరగోళం కొంచెం సద్దుమణగగా, సీఎం గురువారం నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. రేస్కోర్సు రోడ్డులోని శక్తిభవన్లో వివిధ శాఖల అధికారులతో సిద్దరామయ్య చర్చించారు. పర్యాటక, ఉద్యానవనశాఖ, గనులు భూవిజ్ఙాన, కార్మికశాఖ, కన్నడ సంస్కృతి, బీసీ సంక్షేమశాఖ, ఉన్నతవిద్యా శాఖ మంత్రులు, అధికారులతో ఆయా శాఖలకు అవసరమైన నిధులు, గతేడాది కేటాయించిన నిధుల వ్యయం తదితరాల గురించి చర్చించారు. నూతన పథకాల గురించి మాట్లాడారు. మార్చి మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
చిరుద్యోగికి రూ.52 లక్షలకు పైగా టోపీ
శివమొగ్గ: పూజా గౌడ పేరుతో సోషల్ మీడియా ద్వారా నగర సేల్స్మ్యాన్ను వలలో వేసుకున్న ఆన్లైన్ మోసగాళ్లు రూ.52,93,646 ను వసూలు చేశారు. వివరాలు.. ఓ షాపులో పనిచేసే వ్యక్తికి పూజా గౌడ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓ లింక్ను పంపించారు. మోసగాళ్ల మాటలను నమ్మిన వ్యక్తి లింక్ నొక్కి ఆన్లైన్ స్టోర్లో సభ్యుడు అయ్యాడు. వస్తువులను ఆర్డర్ చేసేకొద్దీ అధిక లాభాలు ఇస్తామని అతనికి చెప్పారు. మొదట్లో కొన్ని ఆర్డర్లు చేయించి లాభం వచ్చినట్లు చూపించారు. తరువాత నువ్వే పెట్టుబడి పెడితే దండిగా సంపాదించవచ్చని నమ్మించారు. అలా పలు వారాలలో రూ.52.93 లక్షలను దుండగుల ఖాతాలకు బదిలీ చేశాడు. కొన్నాళ్లకు డబ్బును విత్డ్రా చేసుకోవాలని యత్నించగా, ఏవో కారణాలను చూపుతూ దానిని బ్లాక్ చేశారు. పన్ను, జరిమానా పేరుతో మరింత డబ్బును డిమాండ్ చేశారు. కానీ రూపాయి కూడా తిరిగి రాకపోవడంతో ముంచేశారని ఆలస్యంగా గ్రహించాడు. ఆ సేల్స్మ్యాన్ శివమొగ్గలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మద్యం స్కాంలో మంత్రి దిగిపోవాలి
శివమొగ్గ: ఎకై ్సజ్ శాఖలో లంచం, బదిలీల కుంభకోణం, భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జేడీఎస్, బీజేపీ కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఎకై ్సజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపుర రాజీనామా చేయాలని గురువారం శివమొగ్గలోని శివప్ప నాయక సర్కిల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఎస్ఎన్ చన్నబసప్ప పాల్గొన్నారు. అవినీతిని నిరూపించడానికి డాక్యుమెంట్లు కావాలా?, గతంలో మంత్రి ఈశ్వరప్పపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేశారు, అప్పుడు ఆయన ఆధారాలు అడిగారా? ఇప్పుడు మా వంతు వచ్చింది అని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు గుణపాఠం నేర్పుతారని అన్నారు.
కాన్సులేట్లకు బాంబు బెదిరింపు
యశవంతపుర: బెంగళూరులో పలు విదేశీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు వచ్చింది. హలసూరులోని ఇటలీ, జపాన్ కాన్సులేట్లకు బాంబులు పెట్టామని ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో హడావుడిగా తనిఖీలు చేయగా ఏమీ దొరకలేదు. ఆఫీసుల సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బడ్జెట్ కూర్పుపై సీఎం చర్చలు


