చెరసాలల్లో బదిలీల ప్రయోగం
బనశంకరి: రాష్ట్ర జైళ్లలో ఖైదీలకు అక్రమంగా అందిస్తున్న సౌలభ్యాలు, అవకతవకలను అరికట్టడానికి సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బందిని బదిలీ చేయాలని ఆ శాఖ చీఫ్ అలోక్కుమార్ నిర్ణయించారు. రాష్ట్రంలోని సెంట్రల్, జిల్లా జైళ్లలో, ప్రత్యేకించి పరప్పన అగ్రహార జైలులో కొన్నేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సిబ్బందిని స్థానభ్రంశం చేయాలని సిద్ధమయ్యారు. అక్కడి జైళ్లు సిబ్బంది డబ్బు తీసుకుని ఖైదీలకు రాచ మర్యాదలు చేస్తున్నారని, మొబైల్ఫోన్లు, మద్యం, గంజాయి వంటివి సరఫరా అవుతున్నాయని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి.
వీడియోలతో తలనొప్పి
ఈ నెల 9 నుంచి కేంద్ర జైళ్ల శాఖ కార్యాలయంలో సిబ్బందికి కౌన్సిలింగ్ చేపట్టి బదిలీలు చేయాలని ముహూర్తం కుదిరింది. పరప్పన జైలులో ఖైదీలు కేక్ కటింగ్లు, మద్యంతో విందులు చేసుకునే వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హత్య కేసు నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ కూడా ఆరుబయట కాఫీ తాగుతూ ఖుషీ చేయడం మీద విమర్శలు వచ్చాయి. ఇతర జైళ్ల నుంచి ఇక్కడకు తాత్కాలికంగా వచ్చిన సిబ్బందితో పాటు స్థానికంగా ఏళ్ల తరబడి ఉండి ఖైదీ ముఠాలకు సహకరిస్తున్న ఉద్యోగులను దూరప్రాంత జైళ్లకు తరలించాలని నిశ్చయమైంది. తద్వారా కారాగారంలో క్రమశిక్షణ కాపాడవచ్చునని అలోక్కుమార్ భావిస్తున్నారు.
అవకతవకల కట్టడికి ఆ శాఖ
చీఫ్ అలోక్కుమార్ వ్యూహం
త్వరలో సిబ్బందికి ట్రాన్స్ఫర్లు


