నెరవేరిన నవళగుంద రైతుల కల
హుబ్లీ: నవళగుంద తాలూకా, ఇతర రైతులు వరద సమస్యలతో ఇబ్బందులు పడకుండా రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆదివారం నవళగుంద బెన్నిహళ్ల వాగుపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. నవళగుంద ఎమ్మెల్యే కోనరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో శాశ్వత వంతెన నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇకపై రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. చాలా ఏళ్లుగా వరద ప్రవాహంతో అన్నదాతలు తాము పండించిన పంటలు చేతికి అందకుండా నీటి పాలయ్యేవి. ఇక బెన్నిహళ్ల వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన, నవళగుంద అసెంబ్లీ నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి పనులను సీఎం సిద్దరామయ్య ప్రారంభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతోష్లాడ్, విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి, రెవెన్యూ మంత్రి కృష్ణబైరే గౌడ, మాజీ సీఎం, హావేరి ఎంపీ బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మురికివాడల అభివృద్ధి మండలి అధ్యక్షుడు అబ్బయ్య ప్రసాద్, న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దారి తప్పిన హెలికాప్టర్
రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదివారం లింగసూగురులో విధాన పరిషత్ సభ్యుడు శరణే గౌడ బయ్యాపూర్ కుమారుడి పెళ్లికి సీఎం సిద్దరామయ్య హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారులు సిద్ధం చేసిన మైదానం వదలి మరో చోటికి వెళ్లడంతో అయోమయెంలో పడ్డారు. పోలీసుల భద్రత వైఫల్యం వల్ల ఇలా జరిగిందని సమాచారం. అనంతరం మళ్లీ హెలికాప్టర్లో నిర్దేశించిన మైదానానికి చేరుకున్న సీఎం సిద్దరామయ్య.. వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్, మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అమరే గౌడ బయ్యపూర్ పాల్గొన్నారు.
రూ.200 కోట్ల నిధులతో బెన్నిహళ్ల వాగుపై శాశ్వత వంతెన నిర్మాణం
సీఎం సిద్దరామయ్య
వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన


