అమ్మవారి నెక్లెస్ ఈఓ జేబులోకి
బనశంకరి: బెంగళూరు నగరంలోని ప్రఖ్యాత ధర్మరాయస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో 120 గ్రాముల బంగారు కంఠాభరణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) నాగరాజ్ కాజేశారని ఆలయ మాజీ అధ్యక్షుడు సతీశ్ ఆరోపించారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. హుండీ లెక్కింపులో 120 గ్రాముల నెక్లెస్ లభ్యమైంది. ఈఓ నాగరాజ్ జేబులో వేసుకుని వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నాగరాజ్ కూడా తప్పు ఒప్పుకున్నారని, నెక్లెస్ని వెనక్కి ఇచ్చారని తెలిపారు. కానీ అది 63 గ్రాములే ఉందని, సగం బంగారం మాయం చేశాడని ఆరోపించారు. ఈవోతో పాటు ముఖ్యమైన అధికారులు ఈ దందాకు పాల్పడ్డారని, వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయంలో పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు.
ఎయిర్పోర్టులో కుక్కల గోల
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టును కూడా వీధికుక్కల సమస్య వదలడం లేదు. గతంలో ప్రయాణికులు కూర్చునే కుర్చీలలో వీధికుక్కలు దర్జాగా సేదతీరుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. రన్వేపై కూడా కుక్కలు షికార్లు చేసిన ఉదంతాలు ఉన్నాయి. మరోసారి రన్వేపై వీధికుక్కలు తిరుగుతూ కనిపించడం ఆందోళన కలిగించింది. వాటిని పారద్రోలడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. ఆ సమయంలో విమానాలు ల్యాండ్ కాకపోవడంతో పెద్ద సమస్య తప్పింది.
చీటీలంటూ చీటింగ్
కోలారు: చిట్ఫండ్ లేదా చీటీ.. ఏదైనా గానీ పేరులోనే ఉంది చీటింగ్ అని. అయినా జనం అమాయకంగా చీటీలు కట్టి ఆపై మోసపోయి లబోదిబోమనడం పరిపాటిగా మారింది. కోలారులో ఇలాంటి ఉదంతమే నడుస్తోంది. దీపావళి, వరమహాలక్ష్మీ , ఉగాది పండుగలకు కానుకలు ఇస్తామని జనంతో చీటీలు కట్టించుకుని పరారైన మోసగాన్ని అరెస్టు చేసి తమ సొమ్ము ఇప్పించాలని భాదిత మహిళలు మంగళవారం నగర పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. శాంతి నగర్కు చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి మోసం చేశాడని తెలిపారు. తానే చాలా మంది మహిళల నుంచి దాదాపుగా 52 లక్షల రూపాయల వరకు కట్టించానని, వారంతా తన ఇంటి వద్దకు తనను నిలదీస్తున్నారని లక్ష్మమ్మ అనే మహిళ వాపోయారు. పోలీసులు వెంకటస్వామిని స్టేషన్కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.
అమ్మవారి నెక్లెస్ ఈఓ జేబులోకి


