కొప్పళలో భారీ పరిశ్రమల ఏర్పాటు వద్దు
రాయచూరు రూరల్: కొప్పళలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దని కోరుతూ గురువారం కొప్పళ నగర సభ కార్యాలయం వద్ద పలువురు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు స్థాపించి మానవుల జీవితాలను నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. బల్దోట, కిర్లోస్కర్, కళ్యాణ స్టీల్, ముక్కుంది సుమి తదితర కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పితే తుంగభద్ర జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. 18 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విష పదార్థాలను వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కేంద్రంపై బత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రికి లేఖలను రాయాలని అధికారులను కోరారు. కొప్పళలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరుగుతుందని జిల్లా అధికారి రాజశేఖర్, ఎస్పీ రామ్ అరసిద్ది ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంజునాథ్, మదరి, హన్మంతప్ప, మల్లికార్జున, గురునాథ్ గౌడ, విరుపణ్ణ, వీరభద్రప్ప, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.


