కన్నవారి కాసుల కక్కుర్తి
● రూ.5 లక్షలకు మగశిశువు విక్రయం
కోలారు: కన్నప్రేమ, మానవత్వం అనేవి లేకుండా పసిబిడ్డతోనే వ్యాపారం చేశారు. కోలారు జిల్లాలో శ్రీనివాసపురం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న నీతు, రాఘవేంద్ర అనే జంట తమకు జన్మించిన 7 రోజుల మగ బిడ్డను రూ.5 లక్షలకు అమ్మేశారు. వివరాలు.. నీతు, రాఘవేంద్రలకు గతంలో వేర్వేరుగా పెళ్లయి విడిపోయి సహజీవనం చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నీతు మళ్లీ గర్భం దాల్చి ఓ ప్రైవేటు నర్శింగ్ హోంలో మగబిఢ్డకు జన్మనిచ్చింది. పేదరికం వల్ల సాకలేమంటూ తెలిసినవారికి చెప్పుకున్నారు. దీంతో బ్రోకర్ కొట్రగుళి నారాయణస్వామి.. చింతామణి తాలూకాలోని కృష్ణ– మంజుళ అనే దంపతులకు రూ. 5 లక్షలకు అమ్మేయించాడు. ఇది తెలిసి పోలీసులు అటు, ఇటు జంటలు, బ్రోకర్ను అరెస్టు చేసి చేశారు. శిశువును మళ్లీ తల్లిదండ్రుల వద్దే ఉంచారు.
అపార్టుమెంటులో పిల్లి కేసు
యశవంతపుర: బంగారు, డబ్బు, విలువైన వస్తువులు చోరీకీ గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయటం సహజం. అయితే బెంగళూరులో కడుపుతో ఉన్న పిల్లిని కిడ్నాప్ చేశారంటూ యజమాని ఫిర్యాదు చేయటంతో 9 మందిపై కేసు నమోదు చేశారు. హెచ్ఎఎల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వ్యాన్సి సాలెటర్ అపార్ట్మెంట్లో ఈ విడ్డూరం జరిగింది. యజమాని సాకుతున్న పిల్లి గర్భం దాల్చింది. దీనిని గమనించి కొందరు పిల్లిని తీసుకెళ్లారు. కనిపించక పోవటంతో కంగారు పడి యజమాని హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల చిత్రాల 9 మందిని పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుల్లో అపార్ట్మెంట్ అధ్యక్షుడు శ్రీరామ్, సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉండడం విశేషం.


