వామపక్షాల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మ
మండ్య: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతకాదు. అది వామపక్షాల కబంధ హస్తాల్లో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్ ఆరోపించారు. శనివారం మండ్య నగరంలోని అంబేడ్కర్ భవన్లో రచయిత డాక్టర్ సుధాకర్ హోసల్లి రాసిన నానూ కాఫిరా? పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ.. వామపక్షాలు మహాత్మా గాంధీజీని వక్రీకరించడమే కాకుండా సుభాష్ చంద్రబోస్, బుద్ధుడు, బసవన్న, అంబేడ్కర్ను అవమానిస్తున్నారని అన్నారు. కువెంపు, స్వామి వివేకానందను హిందూ సంస్కృతితో సంబంధం లేని వారిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ లక్ష మందికి పైగా హిందువులు, 70 వేల మంది క్రైస్తవులను దారుణంగా ఊచకోత కోశాడన్నారు. అలాంటి మతోన్మాదిని స్వాతంత్య్ర సమరయోధుడు అని పిలవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.


