ఎర్రజెండాల కన్నెర్ర
గౌరిబిదనూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, రైతు విరోధి చట్టాలను రద్దు చేయాలని కార్మికులకు, రైతులకు న్యాయం చేయాలని సీఐటియూ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎర్రజెండాలు చేబూని నిరసనలకు దిగారు. గౌరిబిదనూరులో వేలాదిమంది ర్యాలీ జరిపారు. రైతుల భూములను లాక్కుని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని, కార్మికుల కడుపు కొట్టేలా 4 చట్టాలను తెచ్చారని, ఉపాధి హామీ పథకం పేరును మార్చేశారని, ప్రజలలో మతమౌఢ్యం నింపుతూ ఉన్నారని కార్మిక నేతలు ఆరోపించారు. మనదేశంలో కార్మికుల పరిస్థితి చింతాజనకంగా ఉందన్నారు. జపాన్ దేశంలో కార్మికులకు గంటకు రూ.600 వేతనం ఇస్తుంటే, మనదేశంలో రూ.5 మాత్రమే లభిస్తోందన్నారు. కార్మికులకు నెలకు రూ.15 వేల వేతనం ఇవ్వడానికి పారిశ్రామిక యాజమాన్యాలు, ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందే తప్ప తగ్గింది లేదని, ప్రధాని మోదీ మాత్రం ముస్తాబై విదేశాల పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మిక నేతలు, వేలాదిగా కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు.
బెంగళూరులో ధర్నాలు
శివాజీనగర: కేంద్రం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహించాయి. బంద్ పిలుపునకు పెద్ద స్పందన లభించలేదు. మైసూరు, హుబ్లీ, మంగళూరు సహా అన్ని నగరాలు, పట్టణాలలో ర్యాలీలు జరిపారు. అన్ని సేవలు యథాతథంగా నడిచాయి. బెంగళూరులో టౌన్హాల్ ముందు కార్మికులు, కమ్యూనిస్టు కార్యకర్తలు ధర్నా చేయగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ మార్గాలలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది.
కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు
ఎర్రజెండాల కన్నెర్ర
ఎర్రజెండాల కన్నెర్ర


