గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి
రాయచూరు రూరల్: గ్రామీణ విధాన సభ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జరిగిన టా్స్క్ పోర్స్ సభలో గ్రామీణ శాసనసభ సభ్యుడు బసన గౌడ దద్దల్ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం తాలుకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జెస్కాం, సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, పంచ గ్యారంటీల అధ్యక్షుడు పవన్ పాటిల్, టీపీఈఓ చంద్ర శేఖర్, తహసీల్దార్ సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్పై
అప్రమత్తత అవసరం
రాయచూరు రూరల్: నేటి సమాజంలో క్యాన్సర్ వ్యాధికి గురవుతున్న వారి సంఖ్య అధికమైంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ఇంటింటా ప్రచారం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు యలహంక మణిపాల్ క్యాన్సర్ అస్పత్రి వైద్యులు విక్రమయ్య, అరన్ ఫెర్నాండజ్ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇమ్యూనోథెరపీ, ట్రోమో సెంటర్ ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తనీయొద్దు
రాయచూరు రూరల్: రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి నితీష్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా అధికారి సభా భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఇతర శాఖల ఉద్యోగులు కలసి కట్టుగా పని చేయాలని సూచించారు. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల కింది భాగంలో మూడు నెలల పాటు నీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లో నీటిని నింపాలని సూచించారు. నీటిని సంరక్షించి పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
బాల్య వివాహాలతో అనర్థాలు
రాయచూరు రూరల్: బాల్య వివాహాలతో అనర్థాలు చోటుచేసుకుంటాయి. నేటి ఆధునిక సమాజంలో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు ముందుండాలని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కార్మిక శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే మహిళా శిశు సంక్షేమ అధికారులు స్పందించాలని సూచించారు.
డ్రగ్ పెడ్లర్ దౌలా అరెస్ట్
బళ్లారి అర్బన్: డ్రగ్ పెడ్లర్ డి.దౌలా అలియాస్ ఎస్.దౌలాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2010 నుంచి 2025 వరకు వివిధ పోలీస్స్టేషన్ల రికార్డులను పరిశీలించగా దౌలాపై మొత్తం 21 కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులే ఎక్కవగా ఉన్నట్లు సమాచారం. దౌలా పలుమార్లు అరెస్ట్ అయినప్పటికీ బెయిల్పై విడుదలై తిరిగి అదే నేరాలు చేసేవాడు. అతడిపై వరుస కేసులు నమోదు కావడంతో గతంలో జిల్లా నుంచి బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మళ్లీ నగరంలోకి వచ్చి యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే బెయిల్పై బయటకు వచ్చి తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగించడం పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి


