స్థలం తిరిగి ఇవ్వాలని యజమాని హుకుం
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన స్థలం తిరిగి తనకు అప్పగించాలంటూ విద్యాశాఖ అధికారులకు యజమాని హుకుం జారీ చేసిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వడగేర తాలూకా హలగేరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సౌకర్యాల నుంచి వంచనకు గురయ్యారు. 30 ఏళ్ల క్రితం విద్యార్థుల విద్యాభ్యాసానికి పాఠశాల నిర్మాణానికి మల్లమ్మ 23 సెంట్ల భూమిని దానం చేసింది. దీంతో సువ్యవస్థతో కూడిన పాఠశాలను నిర్మించారు. అయితే పట్టాదారు పుస్తకంలో రాష్ట్ర గవర్నర్ పేరు మీద చేయించుకోలేక పోయారు. విద్యా శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల స్థల వివాదం చెలరేగింది. మల్లమ్మ మరణించడంతో సమీప బంధువు తమ్మణ్ణ తన పేరు మీద మార్చుకున్నారు. భూమిఽ ధరలు పెరగడంతో పాఠశాల స్థలం తన పేరు మీద ఉందని, పాఠశాలను అభివృద్ధి పరచకుండా ఖాళీ చేయాలని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
30 ఏళ్ల క్రితం 23 సెంట్ల స్థల దానం
ప్రస్తుతం ధరలు పెరగడంతో
భూమి వాపసు కోసం పట్టు


