ఆర్టీసి.. మొండికేసి..
రాయచూరు రూరల్: ప్రయాణికులను వేళకు సరిగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్న ఘటనలు నిత్యకృత్యాలయ్యాయి. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి సర్కార్ భారీగా నిధులు విడుదల చేస్తున్నా కేకేఆర్డీబీ నుంచి బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడా కొత్త బస్సులు రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. కొత్తగా వచ్చిన బస్సులను లాంగ్ సర్వీసులకు వాడుతుండగా పాత బస్సులను గ్రామీణ ప్రాంతాలకు వాడుతుండగా అవి మధ్యలోనే చెడిపోయి నిలబడుతుండటంతో ప్రయాణికులు పడుతున్న బాధలు అంతింత కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏళ్ల తరబడి చెడిపోయిన బస్సులు ఆయా డిపోల్లోనే మగ్గుతున్నాయి. గుజరీకి వేయాల్సిన బస్సులకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.
వేరే బస్సుల్లో తరలింపు
ఆ బస్సులను రోడ్లపైకి వదిలితే రెండు మూడు రోజులు నడవక ముందే రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులను మధ్యలోనే దింపేసి మరో బస్సులో పంపుతున్నారు. డిపోలో టైర్లు లేక నిలిచిన బస్సులు, బ్యాటరీలు చెడిపోయి తుక్కు పట్టిపోతున్నాయి. 4 లక్షల కి.మీ.దూరం సంచరించి దశాబ్దం పాటు సేవలందించిన బస్సులు ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రతి డిపోలో 20కి పైగా బస్సులు గత ఐదేళ్ల నుంచి డిపోల్లోనే నిలిచి ఉన్నాయి. ఇలా కలబుర్గిలో 200, యాదగిరిలో 58, రాయచూరులో 75, కొప్పళలో 60, బళ్లారిలో 78, విజయ నగరలో 28, బీదర్లో 185 బస్సులు నిలిచి పోయాయి. పాత బడిన బస్సులు బ్రేక్లు ఫెయిల్ కావడంతో బోల్తా పడ్డ ఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండటం శోచనీయం.
మార్గంమధ్యలోనే నిలిచిన ఆర్టీసీ బస్సు
టైర్ల కొరతతో డిపోలో నిలిచిన ఆర్టీసీ బస్సులు
క–కలో మొరాయిస్తున్న బస్సులతో
ప్రయాణికులకు వెతలు నిత్యకృత్యం
ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతున్న వైనం
ఆర్టీసి.. మొండికేసి..
ఆర్టీసి.. మొండికేసి..


