నేత్రపర్వంగా కొట్టూరేశ్వర రథోత్సవం
సాక్షి,బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, దైవాంశ సంభూతుడుగా పేరుగాంచిన శ్రీగురు కొట్టూరేశ్వర జాతర, రథోత్సవం కన్నుల పండువగా ఆచరించారు. ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకునే కొట్టూరేశ్వర రథోత్సవం ఈ ఏడాది కూడా ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరిపారు. గురువారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరు పట్టణంలో గురు కొట్టూరేశ్వర రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక, సామాజిక ఐక్యతను చాటే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు బళ్లారి జిల్లా నుంచే కాకుండా గదగ్, దావణగెరె, చిత్రదుర్గ, రాయచూరు తదితర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
పట్టణంలో పండుగ వాతావరణం
హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో జాతర, పండుగ వాతావరణం నెలకొంది. ఇంటింటా రంగవల్లులు వేసుకుని భక్తిశ్రద్ధలతో ఆచరించి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను సాదరంగా స్వాగతం పలికి, రథోత్సవాన్ని విజయవంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం విశేషం. వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. కొట్టూరేశ్వర రథోత్సవానికి ఘనమైన చరిత్ర దాగి ఉండటంతో భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచింది.
ఆలయంలో ప్రత్యేక పూజలు
కొట్టూరేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు, అర్చనలు కూడా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో కొట్టూరులో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా భక్త జనసందోహంతో రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, మూఢ నమ్మకాలను పారదోలేందుకు కూడా ఈ రథోత్సవం ఎంతో దోహదం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అందరూ అశుభంగా భావించే మూలా నక్షత్ర ఆగమ సమయంలోనే రథం లాగుతూ సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలేందుకు కృషి చేస్తుండటం విశేషం.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
నేత్రపర్వంగా కొట్టూరేశ్వర రథోత్సవం


