గర్భిణులకు పౌష్టికాహారం మేలు
రాయచూరు రూరల్: జిల్లాలో బాలింతలు మృతి చెందుతున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం సేవించాలని జాతీయ జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. సింధనూరు తుర్విహాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుండాలో గర్భిణి బాలింతను పరీక్షించి వారికి సలహాలు ఇచ్చారు, బాలింతల మరణాలు సంభవిస్తున్న తరుణంలో గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. వైద్యులకు, అధికారులకు, ఆశా కార్యకర్తలకు, సిబ్బందికి వివరించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని గ్రామ పంచాయతీ అధికారులకు సూచనలు జారీ చేశారు.
మద్దతు ధర ప్రకటించాలి
రాయచూరు రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. శనివారం యాదగిరి ఏపీఎంసీ కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ మాట్లాడారు. పత్తి, మిరప, వరి, వేరుశనగ, సజ్జ, జొన్న, కందులు, మినుము, పెసర పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు.
అధ్యయనంతో ఆత్మసంతృప్తి
హొసపేటె: బహుత్వ దృక్పథం నుంచి అధ్యయనం చేయకుండా భారతదేశ ఆత్మను అర్థం చేసుకోవడం అసాధ్యం అని గదగ్ జిల్లా హులకోటి కేహెచ్.పాటిల్ ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ అప్పన్న హంజే అన్నారు. కన్నడ విశ్వవిద్యాలయంలోని త్రిపది ఆడిటోరియంలో శుక్రవారం అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్మన్ నిర్వహించిన జైన బసది, శిల్పాల భావనలు అనే ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బౌద్ధమతం, జైన మతం, శైవమతం, వైష్ణవ మతం వంటి వివిధ మతాలు భారతదేశం వారసత్వం, సంస్కృతికి పునాదులు అని ఆయన అన్నారు. జైన, బసదిలు, శిల్పాలు కేవలం మతపరమైన భావనలు మాత్రమే కాదు. అవి మతం మేధో, భౌతిక సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన చారిత్రక పత్రాలు. వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా సమాజ విలువలు, ఆలోచనలు, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. జైన మతం అనేక అంశాలతో కూడిందన్నారు. అన్ని జీవులపై గౌరవం, సహనం సందేశాన్ని తెలియజేస్తాయని ఆయన వివరించారు. కన్నడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్. డీవీ.పరమశివమూర్తి, అభయరాజ్ బల్డోటా జైన్ సంస్కృతి అధ్యయన చైర్ కన్వీనర్ డాక్టర్ రమేష్ నాయక్, పురావస్తు శాఖ ప్రొఫెసర్లు డాక్టర్ వాసుదేవ బడిగేర, డాక్టర్ ఎస్వై.సోమశేఖర్, డాక్టర్ మోహన్రావు బి.పంచల్, డాక్టర్.యర్రిస్వామి, పరిశోధకుడు నాగరాజ తదితరులు పాల్గొన్నారు.


